కరీంనగర్ లో వార్ స్టార్ట్ ... ఎంపీ సంజయ్ వర్సెస్ మంత్రి గంగుల .. గ్రానైట్ అక్రమాల రగడ
కరీంనగర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ వార్ మొదలైంది. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇక ఎంపీ బండి సంజయ్ కు చెక్ పెట్టడం కోసం గంగుల కమలాకర్ కు మంత్రి పదవి నుంచి రంగంలోకి దింపారు గులాబీ బాస్ కెసిఆర్. ఇలా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే గ్రానైట్ క్వారీ అక్రమాలను లేవనెత్తి గంగులకు షాక్ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్ .
సీతక్కకు సత్యవతి ఆఫర్ ... టీఆర్ఎస్ లోకి రా .. కలిసి పనిచేద్దామన్న మంత్రి
గ్రానైట్ క్వారీల అక్రమాలపై సీబీఐ విచారణ చెయ్యాలన్న ఎంపీ బండి సంజయ్
ప్రస్తుతం కరీంనగర్ లో గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ వార్ స్టార్ట్ అయింది.ఒకరిమీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కరీంనగర్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక తాజాగా గ్రానైట్ అక్రమాలతో నలుగురు మంత్రులకు సంబంధం ఉందని, సీబీఐ తో విచారణ చేయించాలని బిజెపి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కు చెందిన గంగుల కమలాకర్ నుద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక బండి సంజయ్ చేసిన ఆరోపణలపై గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
ఆరోపణలు నిరూపించాలన్న మంత్రి గంగుల కమలాకర్
బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని, ఆ నలుగురు మంత్రులు ఎవరో పేర్లు చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నిస్తున్నారు.తనను టార్గెట్ చేసుకుని బిజెపి ఎంపీ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్న గంగుల కమలాకర్ తనకు గ్రానైట్ వ్యాపారం తో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఎంపీ తన ఆరోపణలకు ఆధారాలను చూపి రుజువు చెయ్యలేని పక్షంలో కోర్టు కీడుస్తానని ఫైర్ అయ్యారు. తనమీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ పై క్రిమినల్ కేసు పెట్టామని పేర్కొన్నారు.
పరువు నష్టం దావా వేస్తా . కోర్టుకీడుస్తా అని హెచ్చరించిన మంత్రి
బండి సంజయ్ తన పరువును భంగపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. ఇక అంతే కాదు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ ఒక బ్లాక్ మెయిలర్ అని ఆయన పై బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు 2008 నుండి 2011 వరకు జరిగిన గ్రానైట్ రవాణా లో అక్రమాలు వెలుగు చూశాయని అని చెప్పిన ఆయన ప్రస్తుత మంత్రులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు అని, ఇక త్వరలోనే ఎవరు జైలుకు వెళతారో తేలుతుందని గంగుల పేర్కొన్నారు.
గ్రానైట్ అక్రమాల ఆరోపణలతో డిఫెన్స్ లో మంత్రి గంగుల
బండి సంజయ్ ఒక బబుల్ గమ్ ఎంపీ అని వ్యాఖ్యానించిన మంత్రి గంగుల కమలాకర్ సంజయ్ ను త్వరలోనే కోర్టు మెట్లెక్కిస్తామని తేల్చి చెప్పారు.మొత్తానికి బండి సంజయ్ కు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన గంగుల కమలాకర్ కు గ్రానైట్ క్వారీలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కాస్త గట్టిగానే ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే కమలాకర్ అంతే గట్టిగా ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా గంగుల ఎంపీ సంజయ్ కు చెక్ పెడతారని గులాబీ బాస్ అవకాశం కల్పించారు. కానీ మంత్రి గంగుల టార్గెట్ గా ఆరోపణలు చేసి వచ్చీ రాగానే మంత్రి గంగుల కమలాకర్ ను డిఫెన్స్ లో పడేశారు బీజేపీ ఎంపీ సంజయ్ .