వార్ వన్ సైడ్ కాదు...! ఆ రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న ఎంపీ అభ్యర్థులు..!!
ఆదిలాబాద్/హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల సమరంలో ఓ ఘట్టానికి తెరపడబోతోంది. ప్రచార పర్వానికి తెరపడడంతో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రభావంపై చర్చ సాగుతోంది. గడిచిన పదహారవ, పదిహేనవ లోకసభ ఎన్నికల నుంచి ఓటింగ్ తీరును పరిశీలిస్తే ఎన్నికకు ఎన్నికకు మధ్య ఓటింగ్ శాతం మారడం రాజకీయ సమీకరణాలను స్పష్టం చేస్తోంది. ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది.
తెలంగాణలో నువ్వానేనా అన్నట్టు ఎన్నికలు..! అదికార పార్టీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు..!!
గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో లేరు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికల్లో పాత ముఖాలే బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే సోయం బాపూరావు ఒక్కరే ఎంపీ స్థానం కోసం మొదటిసారి పోటీ చేస్తున్నారు. గోడం నగేష్, రాథోడ్ రమేష్ గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు గా ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్జాదవ్ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఇక్కడ 2014 ఎన్నికలను పరిశీలిస్తే.. 75.44 శాతం ఓటింగ్ నమోదు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్కు 41.20 శాతం ఓట్లు లభించడం గమనార్హం. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేష్జాదవ్కు 24 శాతం, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న రమేష్ రాథోడ్కు 17.61 శాతం ఓట్లు పడ్డాయి.
వార్ వన్ సైడ్ కాదు..! ఎవరైనా చమటోడ్చాల్సిందే..!!
నగేష్ లక్షా 71,290 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్పై విజయ బావుటా ఎగుర వేశారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే, 76.30 శాతం ఓటింగ్ కాగా థర్డ్ ఫ్రంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ బరిలో నిలిచి 43.11 శాతం ఓట్లు పొందారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కోట్నాక్ రమేష్ 29.78 శాతం, అప్పట్లో పీఆర్పీ నుంచి మెస్రం నాగోరావు 13.08 శాతం, బీజేపీ అభ్యర్థి అడె తుకారాం 6.71 శాతం ఓట్లను సాధించారు. ఎన్డీఏ తో పొత్తు కారణంగా టీఆర్ఎస్ అభ్యర్థి 2009 ఎన్నికల్లో బరిలో నిలువకపోవడం, 2014 ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగిన తర్వాత టీఆర్ఎస్ గెలుపొందింది. దీన్నిబట్టి పార్టీ ప్రభావమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అభ్యర్థులను బట్టి కూడా ఓటింగ్ ప్రభావం ఉందనేది తేటతెల్లమైంది.
పెద్దపల్లి అదిలాబాద్ లలో ఉత్కంఠ పరిస్థితులు..! గెలుపు అంత ఈసీ కాదంటున్న అదికార పార్టీ నేతలు..!!
పెద్దపల్లిలో ఈసారి కొత్త ముఖాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఎ.చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్.కుమార్, టీఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేతకాని పోటీలో నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, 74.12 శాతం ఓటింగ్ కాగా టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్కు 45.53 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్కు 17.55 శాతం, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జనపతి శరత్బాబుకు 6.2 శాతం ఓట్లు పడ్డాయి.
మారిన ఓట్ల శాతం..! ఆ రెండు జిల్లాల్లో ప్రజలు ఎవరికి జై కొడతారో..!!
2009 ఎన్నికల్లో 68.72 శాతం ఓటింగ్ కాగా కాంగ్రెస్ నుంచి వివేకానందకు 34.7 శాతం ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న గోమాస శ్రీనివాస్కు 29.28 శాతం, పీఆర్పీ నుంచి బరిలో ఉన్న ఆరెపల్లి డెవిడ్రాజ్కు 19.42 శాతం ఓట్లు వేశారు. అప్పుడు వివేకానంద 49,017 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం ఈ రెండు జిల్లాలో వార్ వన్ సైడ్ కాదనే అంశం స్పష్టం అవుతోంది.