ఖబడ్దార్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరిక..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. మొదట రాజగోపాల్ రెడ్డి.. చిరుమర్తిపై విమర్శలు చేయగా.. చిరుమర్తి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. చిరుమర్తిని 'వీడు' అని సంబోధించారు. 'వీడు లింగయ్య కేసీఆర్ డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ మారాడు'అని ఆరోపించారు. లింగయ్య నమ్మక ద్రోహి అని విరుచుకుపడ్డారు.
అటు చిరుమర్తి కూడా రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక దళిత ఎమ్మెల్యేను పట్టుకుని అవమానిస్తావా..? ఖబడ్డార్ అని హెచ్చరించారు. 'నా గెలుపుకు సహకరించావని నీకు గులాంగిరీ చేయాలా..?' అని ప్రశ్నించారు. కోమటి బ్రదర్స్ కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. పదవులను అడ్డుపెట్టుకుని తాను కాంట్రాక్టులు సంపాదించుకోలేదన్నారు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇద్దరి మధ్య సఖ్యత లేదని.. వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
కాగా,డిసెంబర్,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న చిరుమర్తి టీఆర్ఎస్లోకి వెళ్లడం నల్గొండ కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది. రెండుసార్లు టికెట్ ఇప్పించి గెలుపు కోసం కృషి చేస్తే.. చిరుమర్తి తమకు నమ్మకద్రోహం చేశాడని కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శిస్తున్నారు.