ఉరికిచ్చి కొడుతారు... ఏం మాట్లాడుతున్నావ్: రాజగోపాల్ రెడ్డి-ఎర్రబెల్లి మాటల యుద్దం..
తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్దం నడిచింది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించగా.. మధ్యలో జోక్యం చేసుకున్న ఎర్రబెల్లి ఆయనపై నిప్పులు చెరిగారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
డబ్బు రాజకీయంతో తెలంగాణను భ్రష్టు పట్టించారన్న రాజగోపాల్ రెడ్డి..
గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలోనే పచ్చి అబద్దం చెప్పారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ఒకవేళ ఉండి ఉంటే ప్రతిపక్ష పార్టీని విచ్చిన్నం చేసేవారు కాదని అన్నారు.ఎంతసేపు మీరు మాట్లాడిందే వినాలా.. మేము మాట్లాడితే మీరు వినరా.. అని మండిపడ్డారు. డబ్బులు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం గొప్ప కాదన్నారు. టీఆర్ఎస్ గెలిచిన దగ్గర వాళ్ల పార్టీ నేతలే ఛైర్మన్లు అయ్యారు.. కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా టీఆర్ఎస్ నేతలే ఛైర్మన్లు అయ్యారని విమర్శించారు. డబ్బు రాజకీయంతో తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఒక్క కేసీఆర్ కిట్,డెలివరీ కేసులు తప్ప.. మిగతా ఆరోగ్య సమస్యల కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. కార్పోరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తనతో పాటు వస్తే మునుగోడు,మర్రిగూడ,చౌటుప్పల్లో ప్రభుత్వాసుపత్రుల ధీనస్థితి ఎలా ఉందో చూపిస్తానని అన్నారు.
స్కూళ్లు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై నిలదీత...
ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్కూల్లోనూ టాయిలెట్స్ కట్టిన పరిస్థితి లేదన్నారు. సరైన క్లాస్ రూమ్స్,మౌలిక సదుపాయాలు లేక తల్లిదండ్రులెవరూ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించడం లేదన్నారు. ఆరేళ్ల తర్వాత కూడా టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పడం తప్ప ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిని మార్చలేదన్నారు. ఎమ్మెల్యేలు కేవలం భజనపరులుగా మారవద్దని.. సమస్యలపై మాట్లాడాలని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎర్రవల్లి,సిద్దిపేట,సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చినంత మాత్రానా రాష్ట్రమంతా ఇచ్చినట్టేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పయిందని క్షమాపణ అడిగి.. ఇళ్లు లేని పేదవాళ్లకు కనీసం ఒక్క గది నిర్మాణం కోసం రూ.2లక్షలు సాయం చేయాలన్నారు. ముఖ్యమంత్రికి తాము అన్నిరకాలుగా సహాయ సహకరాలు అందిస్తామని.. కానీ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. లేక కొంత ప్రాంతానికే ముఖ్యమంత్రా.. అని ప్రశ్నించారు. కాళేశ్వర ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ద.. పాలమూరు రంగారెడ్డిలో భాగమైన దిండి లిఫ్ట్ ఇరిగేషన్పై ఎందుకు లేదన్నారు. దిండి ద్వారా దేవరకొండ,మునుగోడు ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు.
ఉరికిచ్చి కొడుతారంటూ.. ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు
ప్రభుత్వం ఇలా అనేక విషయాల్లో విఫలమైందంటూ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మైక్ అందుకున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రలు వింటుంటే బాధగా ఉందన్నారు. ఆయన అసలు ప్రజల్లోనే తిరుగుతున్నాడా అని ప్రశ్నించారు. కావాలంటే తనతో రావాలని.. ఏ జిల్లాకు అంటే ఆ జిల్లాకు పోదామని.. ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందామని అన్నారు.
ప్రజలు ఉరికిచ్చి కొడుతారు.. ఏం మాట్లాడుతున్నావ్.. అంటూ రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాకపోతే వరంగల్ జిల్లా ఎడారి అయ్యేదన్నారు. నీకంటే సీనియర్ను అని.. ఎన్నో ప్రభుత్వాలను చూశానని.. రైతులు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో తాను చూస్తున్నానని చెప్పుకొచ్చారు.
Recommended Video
ఎర్రబెల్లికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
ఎర్రబెల్లి వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి సభలోనే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తమకు ఎంతో అభిమానం అని.. వైఎస్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఉద్యమానికి అన్నివిధాలా సహాయ సహకరాలు అందించామని చెప్పారు. ఆయన్ను ఎప్పుడూ ఓ పెద్దన్నలా భావించామని చెప్పారు. అలాంటి వ్యక్తి ముందు సభలో మాట్లాడటం నిజంగా అదృష్టంగా భావిస్తానని చెప్పారు. కానీ తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే మాట్లాడుతారని అన్నారు. ఎక్కడినుంచి పుట్టుకొచ్చారంటూ ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి మితిమీరి మాట్లాడుతున్నారని.. అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.