నిజామాబాద్ లో వార్ వన్ సైడే .. ఎమ్మెల్సీగా కేసీఆర్ తనయ కవిత ఎన్నిక లాంఛనప్రాయమే !!
కరోనా తో వాయిదాపడ్డ నిజామాబాద్ స్ధానిక సంస్ధల శాసన మండలి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపటంతో నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే నెల 9న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్న విషయం తెలిసిందే . కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్ది పోతన్ కర్ లక్ష్మి నారాయణ పోటీలో ఉన్నారు. కేవలం పోటీలో మాత్రమే ఉన్న ప్రతిపక్షాలు కవిత గెలుపును అడ్డుకునే పరిస్థితిలో లేవు . దీంతో ఎన్నిక లాంఛనప్రాయమే అని అర్ధమవుతుంది .
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపధ్యంలో నిజామాబాద్ జిల్లాలో మొదలైన రాజకీయ సందడి
పోలింగ్ తేదీ ఖరారు కావడంతో.. ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. సంఖ్యా పరంగా టీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉండటంతో.. సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యురాలిగా ఎన్నిక కావడం దాదాపుగా ఖరారైంది. నిజామాబాద్ స్ధానిక సంస్ధల శాసన మండలి స్ధానికి వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి గతంలో ఎన్నికైన అభ్యర్ధి భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 7న ఎన్నిక జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఎన్నికను తొలుత 60 రోజులు ఆ తర్వాత మరో 45 రోజుల పాటు మొత్తం 105 రోజుల పాటు వాయిదా వేశారు.
వాయిదా పడిన ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ .. ఊపిరి తీసుకున్న కవిత
ఎట్టకేలకు వాయిదా పడ్డ స్ధానిక సంస్ధల శాసన మండలి ఉపఎన్నికకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపడంతో జిల్లాలో స్ధానిక సందడి మొదలైంది. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుండగా.. 12న విజేతను ప్రకటించనున్నారు. ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్న ఈ ఎన్నికకు స్ధానిక సంస్ధల నుంచి గెలుపొందిన వారిలో టీఆర్ఎస్ అభ్యర్ధులు 70శాతం ఉండటం ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనంగా మారింది. టీఆర్ఎస్ కు మెజార్టీ దృష్టా గెలుపోటములపై ఉత్కంఠ లేకుండా పోయింది.
ఎన్నికకు ఎవరి బలం ఎంత ? కవిత ఎన్నిక నల్లేరు మీద నడకే !!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 824 మంది స్ధానిక సంస్ధల ఓటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి 494 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు 140 మంది ఉన్నారు . బీజేపీ నుంచి గెలిచిన వారు 84 మందిగా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు స్వతంత్రులు 66, ఎంఐఎం కు 28 మంది ఓట్ల బలం ఉంది. ఇప్పటికే స్వతంత్రులు, ఎంఐఎం, ఓటర్లు టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. కాంగ్రెస్ -బీజేపీ నుంచి పలువురు జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ ఓట్లు బలం 600 వరకు చేరింది. కాంగ్రెస్ -బీజేపీ రెండింటికీ కలిపి 180 లోపు ఓట్ల బలం ఉండటంతో ఎమ్మెల్సీగా కవిత గెలుపు నల్లేరుపై నడకలా మారింది.
భారీ మెజార్టీతో రికార్డు సృష్టించే ఆలోచనలో టీఆర్ఎస్
వార్ వన్ సైడ్ అన్నట్లు ఎన్నిక జరగనుంది. భారీ మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించాలని.. గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీఆర్ఎస్ తరపున స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి పదవీ కాలం.. 2022 జనవరి 4 వరకు ఉంది. ఐతే మొన్నటి శాసన సభ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీపై రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారడంతో ఆయనపై ఫిర్యాదు చేయడంతో 2019 జనవరి 16న అనర్హత వేటు పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
Recommended Video
అమల్లోకి ఎన్నికల కోడ్ ... రాజకీయ వర్గాల్లో చర్చ
ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనుండగా ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సురేష్ రెడ్డికి ఓటు హక్కు లేదు. అంతకు ముందే ఓటరు జాబితా తయారు కావడంతో సురేష్ రెడ్డికి ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మెదక్ జిల్లాలో ఎక్స్ అఫీషియోగా ఉండటం వల్ల ఆయనకు ఇక్కడ ఓటు వేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ పచ్చజెండా ఊపడంతో జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సందడి మొదలైంది.