ఇసుక మాఫియాపై రచ్చరచ్చ: సీఎం కేసీఆర్ను వెనుకేసుకొచ్చిన గవర్నర్.. కాంగ్రెస్ నేతల ఫైర్
హైదరాబాద్: రాజ్భవన్లో రచ్చ చోటు చేసుకున్నది. రాష్ట్రంలో ఇసుక మాఫియా విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను గవర్నర్ నరసింహన్ వెనకేసుకురావడంపై కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం కలిగించింది. ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ మల్లురవి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది.
ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని, మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్కు శుక్రవారం రాజ్భవన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు వినతిపత్రం సమర్పించారు. వారి మధ్య మాట, మాటా పెరిగింది. పరస్పరం వాదనలు చోటు చేసుకున్నాయి. ఇసుక మాఫియాకు బలైన వీఆర్ఏ సాయిలు ప్రస్తావన తీసుకురాగ ఆయన సాధారణ వ్యక్తి అంటూ గవర్నర్ కామెంట్ చేశారని కాంగ్రెస్ నాయకులు మీడియాకు వివరించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఇలా
ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయని, నేరెళ్ళ ఘటనకు సీఎం కే చంద్రశేఖరరావు, ఆయన కొడుకు మంత్రి కే తారకరామారావు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ ఘటనలో వారి పాత్ర ఏముందని గవర్నర్ ప్రశ్నించడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక వ్యాపారం కొత్తేమీ కాదని, గతంలోనూ జరిగినట్లే ఇప్పుడూ జరుగుతున్నదని గవర్నర్ అనడంతో వారు మండిపడ్డారు. కేసీఆర్ను, కేటీఆర్ను ఎలా వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు.
మీ దగ్గరకు రావడమే వేస్టన్న కాంగ్రెస్ నేతలు
‘టీఆర్ఎస్ ఏజెంట్ మాదిరిగా మాట్లాడుతున్నారు? సీఎంకు వత్తాసు పలుకుతున్నారు.. మేం చిన్నపిల్లలం అనుకుంటున్నారా? మేము ఏం చేయాలో మీరు నిర్దేశిస్తారా?, ‘ఫెలో' అంటారా.. మేమూ చదువుకున్నాం.. మొక్కి దండాలు పెట్టి గవర్నర్గా కొనసాగుతున్నారు.. గుర్తు లేదా? సోనియా, మన్మోహన్ నియమిస్తేనే గవర్నర్ గా నియమితులయ్యారన్న సంగతి గుర్తు తెచ్చుకోండి' అని కాంగ్రెస్ నేతలు సర్వే సత్యనారాయణ, మల్లు రవి గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘మీ దగ్గరకు రావడమే వేస్ట్' అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారని సమాచారం.
మందక్రుష్ణతో శాంతిభదత్రల సమస్య తలెత్తుతుందని వెల్లడి
దీంతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది. ‘నన్ను టీఆర్ఎస్ ఏజెంట్ అంటారా? ప్రతిదానికీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆరేనా? వారిద్దరిపై ఆరోపణలు తగదు.. ఇంతకుముందు మాదిరే ఇప్పుడూ ఇసుక మాఫియా ఉంది' అని నరసింహన్ అన్నారు. అయినా ‘మీ నాయకులకు అక్కడేం పని? మందక్రుష్ణ దీక్షతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది? ఉద్యమ సమయంలో అసెంబ్లీలో నా మీదకు కొందరు వచ్చినా మీరు స్పందించలేదు' అని కాంగ్రెస్ నేతలపై గవర్నర్ వ్యాఖ్యానించారు.
మాల, మాదిగలంటే చిన్న చూపెందుకని ప్రశ్న
మందకృష్ణ దీక్ష చేస్తామంటే అక్రమంగా అరెస్టు చేసినా మీరు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మందకృష్ణ దీక్షకు కూర్చోవడం సరైనది కాదని గవర్నర్ అనడంతో వాగ్వాదం పెరిగింది. సొంత కార్యాలయంలో కూడా దీక్ష చేసుకోవడానికి అవకాశం లేని పరిపాలనపై గవర్నర్ జోక్యం చేసుకోకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు చేశారు. గవర్నర్లా కాక టీఆర్ఎస్ నేతలా వ్యవహరిస్తున్నారని సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. మాల, మాదిగలంటే ఇంత చిన్న చూపు ఎందుకుని నిలదీశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి కలుగజేసుకుని పరిస్థితిని శాంతింప చేసినట్టు పార్టీ నేతలు చెప్పారు. ఇక ముందు మిమ్ముల్ని కలిసేది లేదని గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారని సమాచారం.
ఇసుక మాఫియా ఆగడాలను వివరించిన కాంగ్రెస్ నేతలు
తొలుత నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇరు పక్షాల మధ్య మొదలైన చర్చ వెంటనే రాష్ట్రంలో ఇసుక మాఫియాపైకి మళ్లింది. కామారెడ్డి జిల్లాలో ఒక ‘వీఆర్వో'ను ట్రాక్టర్లతో తొక్కించి చంపారని, ఊరంటా పోలీసులతో నిర్బంధించారని పత్రికల్లో వార్తలొస్తున్నాయని గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ పార్టీ నేతలు వివరించారు. ఆదాయం సంగతి దేవుడెరుగు.. ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయం దెబ్బ తింటున్నదని గవర్నర్ నరసింహన్కు చెప్పారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బ తింటున్నదన్నారు. మైనింగ్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనూ ఇసుక మాఫియా ‘నేరెళ్ల' గ్రామంలో పోలీసులతో ప్రజలను చిత్ర హింసలకు గురి చేసిందని ఉత్తమ్ గుర్తు చేశారు. వారిని పలుకరించడానికి వచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను చులకన చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇలా గవర్నర్ అటాక్
కానీ ఆ వెంటనే కామారెడ్డి జిల్లా పరిధిలో చనిపోయిన వ్యక్తి వీఆర్ఏ కాదని ప్రభుత్వోద్యోగి కాదని గవర్నర్ వాదించారని సమాచారం. వేరే కారణాలతో మరణించారని తనకు తెలిసిందని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ‘మీకు' అక్కడేం పని అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రాజకీయ నాయకులంగా తమ బాధ్యతలు తమకు తెలుసునని, మీరు శాంతిభద్రతలపై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసినా.. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడిపై మీరు (కాంగ్రెస్ నేతలు) ఆరోపణలు చేయకూడదని గవర్నర్ చెప్పడానికి ప్రయత్నించారని వినికిడి.
కాంగ్రెస్, గవర్నర్ భేటీపై రాజ్ భవన్ ఇలా వివరణ
కానీ తామేం చేయాలో మీరు చెప్పలేరని, తాము మాట్లాడే అంశాలను మీరు వినడం మీ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్న తరుణంలో సర్వే సత్యనారాయణ స్పందించడంతో వివాదం రాజుకున్నదని తెలుస్తున్నది. గవర్నర్ హోదాలో తమ వంటి వారు సీఎం, ఆయన కొడుకును వెనుకేసుకు రాకూడదని సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ క్రమంలో సర్వేను ఉద్దేశించి ‘ఫెలో' అనడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. తర్వాత కాంగ్రెస్ నేతలు ఆయనకు నచ్చజెప్పగా, మల్లు రవి ప్రతిస్పందించారు. గవర్నర్ నరసింహన్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భేటీలో ఘర్షణలో మీడియాలో వార్తలు రావడంతో రాజ్భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. కాంగ్రెస్ నేతలతో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించాయి. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తామని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని పేర్కొన్నాయి. రాజ్భవన్ తన గౌరవాన్ని కాపాడుకుంటూ హుందాగా వ్యవహరిస్తుందని పేర్కొన్నాయి. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమాన్ని గవర్నర్ కాంక్షిస్తున్నారని రాజ్భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.
సంచలనాలపై ‘మీడియా'కు ఆపాదింపులు
రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం చనిపోయిన వ్యక్తి వీఆర్ఎ కాదని సాదారణ వ్యక్తి అని ఒక బహిరంగసభలో పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లకు పని పాటేమీ లేదని ఎదురు దాడికి దిగారు. మీడియా సంచలనాల కోసం అవాస్తవాలు రాస్తున్నదన్న మాట కూడా చెప్పారు. గతంలోనూ ఉన్న ఇసుక మాఫియా ఇప్పుడు కొనసాగుతున్నదనడంలో సందేహం లేదు. కాకపోతే వీఆర్ఎ సాయిలు మరణించిన ఘటనలో అధికార టీఆర్ఎస్ నేత ప్రధాన నిందితుడు కావడమే ఆ పార్టీ అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. వీఆర్ఏ సాయిలు మరణంపై మీడియాలో వాస్తవిక ద్రుక్పథంతోనే వార్తలొచ్చాయి. ఈ సంగతి విస్మరించి మీడియాపైనా, కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఎదురుదాడికి దిగడం వల్ల సమస్యను మసిపూసి మారేడు గాయ చేయాలని ప్రయత్నిస్తే వికటిస్తుందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.