మేమేంటో చూపిస్తాం: కేసీఆర్పై నాగం, టిడిపి-కాంగ్రెస్ పొత్తుపై హరీష్
తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవమానించడం సరికాదని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవమానించడం సరికాదని, బిజెపి జోలికి, బిజెపి నేతల జోలికి వస్తే ఊరుకోమని, మేమేంటో చూపిస్తామని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా చెప్పిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పోల్చుకోవడం కేసీఆర్కు సరికాదన్నారు. తెరాస పాలనలో అవినీతే లేదని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
ప్రభుత్వ అవినీతిపై చర్చకు తాము సిద్ధమని నాగం తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో రూ. 2,400 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ. 50 కోట్ల విలువైన మోటార్ల విలువను రూ.90 కోట్లకు పెంచారన్నారు.
నాగం వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు బిజెపిలో నాగం స్థానం ఏమిటో అందరికీ తెలియాల్సి ఉందని ఎద్దేవా చేశారు. కుల వృత్తులను పోత్సహించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొర్రెలు, చేపల వంటి వాటని పంపిణీ చేస్తుంటే నాగం గొల్ల, కురుమలను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు.
ఇది నాగం జనార్థన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలా, లేక బిజెపి అభిప్రాయమో చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ను హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల విషయంలో నాగం మళ్లీ పాత పాటే పాడుతున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుల పాలిట శిఖండిలా వ్యవరిస్తున్నారన్నారు.
ఈపీసీ విధానాన్ని తొలగించి పారదర్శకుంగా పని చేస్తుంటే ప్రాజెక్టుల్లో అవినీతి అని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా గొర్రెల పంపిణీలో అవినీతి జరుగుతోందని విమర్శిస్తున్నారన్నారు. ఒక్క గొర్రెను కొనుగోలు చేయకుండానే అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించారు.