ఉపఎన్నిక: నామినేషన్ వేసిన రాజయ్య, బీజేపీ-టీడీపీ అభ్యర్ధి ఎవరు?
హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరగణంతో వరంగల్ కలెక్టరేట్కు వచ్చిన రాజయ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అధిష్టానం వద్ద పోరాడి టిక్కెట్ తెచ్చుకున్న మాజీ ఎంపీ రాజయ్య ఈ ఉపఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే రాజయ్యకు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి సహకారం లభించడం కాస్తంత అనుమానమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లాలో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ ఇందుకు కారణమని పార్టీ శ్రేణలు అంటున్నాయి.
మరోవైపు మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీలు ఇంకా అభ్యర్ధి ఎంపికలోనే ఉన్నారు. నామినేషన్ల గడువు రెండు రోజుల్లో ముగుస్తున్నా ఇంకా వారు ఒక నిర్ణయానికి రాలేదు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఆదివారం రాత్రి దాకా కొలిక్కి రాలేదు.
ఇప్పటికే ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్య, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, స్థానికంగా ప్రముఖుడైన డాక్టర్ రాజమౌళి పేర్లపై పార్టీలో ఓవైపు చర్చ జరుగుతుండగానే తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. టీఆర్ఎస్లో వివిధ స్థాయిల్లో పనిచేసి గతంలోనే ఆ పార్టీని వీడిన చింతా స్వామి, పోలీసు అధికారి నాగరాజునూ అభ్యర్థిగా ప్రకటించే అంశంపై ఆదివారం పార్టీ నేతల సమావేశంలో చర్చ జరిగింది.
అయితే నాగరాజు ఇంకా సర్వీసులోనే ఉండటంతో ఆయనకు పోటీ చేసేందుకు అనుమతి లభించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో దేవయ్య లేదా స్వామిలలో ఒకరిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది.
స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన వీజే రెడ్డి కారులో రూ.1.90 లక్షలు, ఎస్ రెడ్డి వద్ద రూ.లక్ష పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.40.88,000 సీజ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.