వామపక్ష నేతల భేటీ: వరంగల్లో పోటీకి గద్దర్ అనాసక్తి
హైదరాబాద్: త్వరలో జరిగే వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా యుద్దనౌక గద్దర్ ఆసక్తి కనబరచడం లేదు. వామపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయనవప కలిసి తమ అభిప్రాయం తెలిపారు.
పోటీకి గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు. తెలంగాణ ప్రజల కలలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చడం లేదని, పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది పోయి పోరుగు రాష్ట్రంలో కొట్లాట పెట్టుకుంటోందని ఆయన వామపక్ష నేతలతో అన్నారు. అలాగే భవిష్యత్లో ఎన్నికల్లో పోటీపై ఇప్పుడే చెప్పలేననని అన్నట్లు తెలిసింది. తెలంగాణ అభివృద్ధికై కేంద్రంతో పోరాడి నిధులు సాధించాల్సి ఉందన్నారు.
అంతకుముందు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక, పోటీకి దించాల్సిన ఉమ్మడి అభ్యర్థిపై చర్చ జరిగింది. అనంతరం వారంతా గద్దర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. గద్దర్తో భేటీ అయిన వారిలో లెఫ్ట్ పార్టీల నాయకులు చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జానకిరాములు, ఎండీ గౌస్, సురేందర్రెడ్డి, మురారి ఉన్నా రు.
తన వయస్సు 60ఏండ్లు దాటిందని, శరీరంలో బుల్లెట్ ఉందని, ఎన్నికల బరిలో నిలవాలనే అంశంపై ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని గద్దర్ కోరినట్లు తెలిసింది. ఈ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందని వామపక్ష నేతలు గద్దర్కు వివరించినట్లు తెలిసింది. దీనిపై గద్దర్ స్పందిస్తూ తాను మొదటినుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉండి పార్లమెంట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశానని, తానిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెప్పినట్టు తెలిసింది.
ప్రజలు కోరితే రాజకీయాల్లోకి: గద్దర్
వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలో నిలవాలని కోరినందుకు ధన్యవాదాలని గద్దర్ అన్నారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యమ పాటగా ప్రజలను చైతన్యవంతం చేసిన తను వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.