వరంగల్ ఉప ఎన్నిక: చక్రం తిప్పిన కెటిఆర్, హరీష్ రావు నారాజ్?
హైదరాబాద్/వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నారాజ్ అయ్యారా? ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చక్రం తిప్పారా? అంటే కావొచ్చునని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
వరంగల్ లోకసభ ఉప ఎన్నిక నేపథ్యంలో.. హరీష్ రావు వర్గం నాయకుడిగా భావించి ఎర్రోళ్ల శ్రీనివాస్ మొదటి నుంచి రేసులో ఉన్నారు. అయితే, ఆ తర్వాత ఆయనకు టిక్కెట్ దక్కలేదు. తద్వారా హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయంటున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయంతో మంత్రి కెటిఆర్ చక్రం తిప్పారని, దీంతో తన అనుచరుడైన పసునూరి దయాకర్కు టిక్కెట్ ఇప్పించుకున్నారనే ప్రచారం సాగుతోందని అంటున్నారు. దీంతో హరీష్ రావు నారాజ్ అయ్యారని అంటున్నారు.
మరోవైపు, స్థానికుడు కాదనే కారణంతో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో... ఎర్రోళ్ల శ్రీనివాస్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అతను ఎవరికీ అందుబాటులో లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా హరీష్ రావును కేవలం ఒక సెగ్మెంట్కు పరిమితం చేయడంపై కూడా చర్చ జరుగుతోందంటున్నారు. ఫ్లెక్సీల్లో హరీష్ ఫోటో కనిపించడం లేదని చెబుతున్నారు.
వరంగల్లో విజయం మాదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
వరంగల్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్య విజయం సాధిస్తారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. టిఆర్ఎస్, బిజెపిలకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు ఆదివారం గాంధీ భవన్లో బిఫారం అందించారు.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదున్నారు. రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రశ్నిస్తే లాఠీఛార్జీ చేయిస్తున్నారని, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థినిని ఎన్ కౌంటర్లో చంపేశారన్నారు. ప్రశ్నించిన వారిని జైళ్లలో పెడుతున్నారన్నారు.