బావిలో మృతదేహాలు.. సంజయ్ వేసిన స్కెచ్ ఇదీ.. విచారణలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి..
ఒకటి కాదు.. రెండు కాదు... 9 మహా.. హత్యలా.. సామూహిక ఆత్మహత్యలా అన్న అనుమానాలు... ఎట్టకేలకు ఈ మిస్టరీ వీడిపోయింది. తొలుత ఆత్మహత్యలుగా అనుమానించిన కేసు.. ఆ తర్వాత అనుమానాస్పద మరణాలుగా.. ఆపై హత్యలుగా మలుపు తిరిగింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం వద్దనున్న బావిలో వెలుగుచూసిన మృతదేహాలను హత్యకు గురైనట్టు పోలీసులు నిర్దారించారు. సంజయ్ కుమార్ అనే యువకుడే ఈ హత్యలు చేసినట్టుగా తేల్చారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణంగా అనుమానిస్తున్నారు.అయితే మక్సూద్ అల్లుడి డైరెక్షన్ మేరకే తాను హత్యలు చేయాల్సి వచ్చిందని సంజయ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. దానికి సంబంధించిన కోణం వెలుగుచూడాల్సి ఉంది. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్ పోలీసులు కేసును చేధించడం విశేషం.
బావిలో 9 మృతదేహాలు : రెండు వెర్షన్స్.. ఏది నిజం... అసలేం జరిగింది...?
హత్యలకు ఇలా స్కెచ్ వేశాడు..
గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో ఉన్న రెండు గదుల్లో మక్సూద్ కుటుంబం నివసిస్తోంది. బుధవారం రాత్రి మక్సూద్ కూతురు బుష్రా కొడుకు(3) బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఆ పార్టీకి సంజయ్ కుమార్ హాజరయ్యాడు. అయితే పార్టీకి వెళ్లేముందు సాయంత్రం 7గంటలకు వెంకట్రామ థియేటర్ సమీపంలో తన స్నేహితుడైన మిద్దెపాక యాకూబ్,అంకూస్లను కలుసుకున్నాడు. అదే సమయంలో వరంగల్లోని నాలుగైదు మెడికల్ షాపుల నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. పార్టీకి వెళ్లిన తర్వాత పథకం ప్రకారం కూల్ డ్రింక్స్లో నిద్రమాత్రలు కలిపి అందరికీ ఇచ్చాడు. అవి తాగాక మక్సూద్ కుటుంబం,బీహారీ యువకులు,డ్రైవర్ షకీల్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం స్నేహితుల సహాయంతో సంజయ్ కుమార్ వారిని గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు.
ఎలా చేధించారు...
సంజయ్ కుమార్కు కొంత కాలంగా మక్సూద్ కుటుంబంతో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మక్సూద్ కుటుంబ సభ్యులందరితోనూ అతను తరుచూ వాట్సాప్ చాట్ చేసినట్టు గుర్తించారు. ఘటన జరిగిన మరుసటిరోజు గురువారం(మే 21) సంజయ్,యాకూబ్ మాత్రమే వెంకట్రామ థియేటర్ నుంచి వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఫోన్ కాల్ డేటా,సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. సంజయ్ కుమార్ నివాసం ఉండే స్తంభంపల్లిలో పోలీసులు తనిఖీలు చేయగా అక్కడ కూడా కీలక ఆధారాలు లభించాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇటీవల మక్సూద్ ఆలం రూ.25వేలు విలువ చేసే సామాగ్రి కొని తెచ్చాడు. కానీ ఆ ఘటన జరిగినరోజు ఆ ఇంట్లో గ్యాస్ స్టవ్,సిలిండర్ తప్ప ఏమీ కనిపించలేదు. అయితే ఆ వస్తువులన్నీ సంజయ్ కుమార్ స్తంభంపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లినట్టు గుర్తించారు. బలమైన ఆధారాలతో పోలీసులు సంజయ్ను తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఎట్టకేలకు నిజం ఒప్పుకోక తప్పలేదు.
కొత్త ట్విస్ట్..
నిజానికి తొలుత బిహారీ యువకులైన శ్యాం కుమార్షా(21), శ్రీరాం కుమార్షా(26) లను వదిలేద్దామని భావించినట్టు సంజయ్ విచారణలో వెల్లడించాడు. కానీ హత్యల విషయం వారి ద్వారా బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతో.వారిని కూడా హత్య చేసినట్టు అంగీకరించాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యలన్నింటికి దారితీసినట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో ఉన్న మక్సూద్ అల్లుడు ఖతూర్ డైరెక్షన్ మేరకే హత్యలు చేశానని సంజయ్ చెప్పడం కొత్త ట్విస్ట్గా మారింది. సంజయ్ చెబుతున్న అతను.. బుష్రా భర్తనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా బుష్రా ఆమె భర్త వేర్వేరుగానే ఉంటున్నారు. బుష్రా వివాహేతర సంబంధాలపై అనుమానం నేపథ్యంలో అతని భర్తే హత్యకు ప్లాన్ చేయించాడా అన్నది తేలాల్సి ఉంది. నిందితుడు సంజయ్కుమార్ను సోమవారం లేదా మంగళవారం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Recommended Video
ఇలా వెలుగులోకి..
గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం(55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడి మృతదేహాలు గురువారం బయటపడ్డాయి. ఆ మరుసటి రోజు శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం(18)తో పాటు అదే గోదాంలో పనిచేసే బీహార్ వలస కార్మికులు శ్యాం కుమార్షా(21) శ్రీరాం కుమార్షా(26), మక్సూద్ సన్నిహితుడైన డ్రైవర్ మహమ్మద్ షకీల్(30) మృతదేహాలు బయటపడ్డాయి. ఫోన్ కాల్ డేటా ఆధారంగా సంజయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కేసును చేధించారు. ప్రస్తుతం మక్సూద్ ఆలం మరదలు, యాకూబ్, మంకుషా, ఆటోడ్రైవర్ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.