గొర్రెకుంట హత్యలు : భయమనేదే లేదు.. పోలీసులకూ జంకని సంజయ్..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని గన్నీ సంచుల గోదాం ఆవరణలోని బావిలో వెలుగుచూసిన హత్యల ఉదంతానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నిజానికి హత్యల తర్వాత నిందితుడు సంజయ్లో ఎక్కడా ఎలాంటి బెరుకు కనిపించలేదు. పోలీసులు ప్రశ్నించినా జంకకుండా.. ఏ తప్పు చేయనట్టు సమాధానాలిచ్చాడు. కానీ సీసీటీవీ ఫుటేజీ,మక్సూద్ ఆలంలో ఇంట్లో మాయమైన వస్తువుల ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు సంజయ్ దొరికిపోయాడు. విచారణలో నేరం అంగీకరించిన సంజయ్.. హత్యల గురించి పోలీసులకు చెప్పిన పలు విషయాలు వెలుగుచూశాయి.
ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?
మొదట నిషా ఆలంను బావిలో పడేసి..
గత బుధవారం( మే 20) మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఆలం మూడేళ్ల కుమారుడు బబ్లూ బర్త్ డే పార్టీకి సంజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ముందే వెంట తీసుకొచ్చిన నిద్ర మాత్రలను విందు కోసం వండిన ఆహార పదార్థాల్లో కలిపాడు. అందరూ భోజనం చేశాక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనంతరం మక్సూద్ భార్య నిషా ఆలంను మొదట బావిలో పడేశాడు. రఫీకా ఆచూకీ గురించి ఆమె తనను పదేపదే నిలదీయడం... పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో.. మొదట ఆమెనే హత్య చేసినట్టు తెలుస్తోంది.
ఏమీ తెలియనట్టు వెతుకులాట..
నిషా ఆలం తర్వాత వరుసగా బుష్రా,బబ్లూ,సోహెల్,షాబాజ్,మక్సూద్,షకీల్,శ్యామ్లను సంజయ్ బావిలో పడేశాడు. చివరగా శ్రీరామ్ను కూడా బావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు గన్నీ సంచుల ఫ్యాక్టరీ యజమాని సంజయ్కి ఫోన్ చేయగా అక్కడికి వచ్చాడు. మక్సూద్ కుటుంబం ఆచూకీ కనిపించట్లేదని చెప్పగా.. ఏమీ తెలియనట్టు అతనితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. పలువురికి ఫోన్ చేసి ఆరా తీసినట్టు నటించాడు.
పోలీసుల ముందు కూడా జంకని సంజయ్..
పోలీసులు సంజయ్ని ప్రశ్నించినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా తనకేమీ తెలియదన్నట్టుగా సమాధానాలు చెప్పాడు. అతని ధైర్యం చూసి పోలీసులు కూడా అనుమాన పడలేదు. దీంతో ఇక తాను సేఫ్ అనుకున్న సంజయ్... బావిలో మృతదేహాలను వెలికి తీస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ చివరకు సీసీటీవీ ఫుటేజీలో దొరికిన ఆధారాలు,అలాగే మక్సూద్ ఇంట్లో బర్త్ డే పార్టీ రోజు మాయమైన వస్తువులు స్తంభంపల్లిలోని సంజయ్ ఇంట్లో దొరకడంతో అతనే నిందితుడని తేల్చారు. విచారణలో నేరం అంగీకరించడంతో హత్యల మిస్టరీ వీడిపోయింది.
వరంగల్ సెంట్రల్ జైలుకు తరలింపు..
సంజయ్ను మంగళవారం(మే 26) జిల్లా న్యాయ సేవా సదన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎ.కుమారస్వామి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి సంజయ్కి వచ్చే నెల 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో సంజయ్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేసి.. ఆపై అత్యంత భద్రత నడుమ ఉండే ఓ బ్యారక్లోకి అతన్ని పంపించారు. జైలుకు వెళ్లేముందు రఫీకా కుమార్తె మాట్లాడుతానని సంజయ్ పోలీసులను కోరగా.. అందుకు వారు నిరాకరించారు.
Recommended Video
అంత్యక్రియలు పూర్తి..
మంగళవారం బెంగాల్ నుంచి మక్సూద్ బంధువులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ హత్యలన్నీ సంజయ్ ఒక్కడే చేశాడా... లేక కుట్ర కోణం ఏమైనా ఉందా అని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ షకీల్ మృతదేహాన్ని అతని భార్య మున్నీరుబేగంకు అప్పగించగా.. ఆలస్యంగా అప్పగించారని ఆమె ఆందోళనకు దిగారు. మృతుల్లో బీహార్ యువకులైన శ్రీరామ్,శ్యామ్ల అంత్యక్రియలు ఇంకా నిర్వహించలేదు.