వరంగల్: ఘన విజయం, కెసిఆర్, కడియంలను అధిగమించిన దయాకర్
వరంగల్ :వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. తన సమీప కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణపై ఆయన 4,59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మొత్తం పోలైన ఓట్లలో దయాకర్కు 6 లక్షల 15 వేల 403 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు లక్షా 56 వేల 315 ఓట్లు వచ్ాచయి. బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు లక్షా 30 వేల 178 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్కూ దయాకర్ మెజారిటీ పెరుగుతూ వచ్చింది.
2014 సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరికి 3 లక్షల 92 వేల 513 ఓట్ల మెజారిటీ లభించింది. ప్రస్తుతం దయాకర్ 4 లక్షల 59 వేల 092 ఓట్ల మెజారిటీ సాధించి కడియం శ్రీహరి మెజారిటీని అధిగమించారు. పసునూరి దయాకర్ విజయంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. కెసిఆర్ రికార్డును కూడా దయాకర్ బద్దలు కొట్టారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్కు 3,97,029 మెజార్టీ వచ్చింది.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి లభించిన ఓట్ల మెజారిటీని బ్రేక్ చేశారు. ప్రస్తుతం ఆయన నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 3,31,089 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,12,822 ఓట్లు వచ్చాయి. దయాకర్కు 4 లక్షల 43 వేల 915 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి దేవయ్యచకు 89 వేల 828 ఓట్లు వచ్చాయి. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 2 లక్షల 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 45 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ తొలి రౌండులో ఏడు వేల ఆధిక్యత సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెసు అభ్యర్థి సర్వే సత్యనారాయణకు నాలుగు ఓట్లు వచ్చాయి. తొలి రౌండులోనే టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 15 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు.
వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య వరంగల్లోని ఎనుమాముల మార్కెటులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో అసెంబ్లీ పరిధిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విడివిడిగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఆరంభమైంది.
వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఉదయం 8గంటలకు ముందుగా వాటిని లెక్కిస్తున్నారు. దీని అనంతరం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూంల నుంచి తరలిస్తారు.
లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం సిబ్బందితో ఒకసారి మాక్ కౌంటింగ్ను కూడా అధికారులు పూర్తి చేశారు. శనివారంనాడు పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పసునూరు దయాకర్, కాంగ్రెసు తరఫున సర్వే సత్యనారాయణ, బిజెపి - తెలుగుదేశం కూటమి తరఫున దేవయ్య బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.