వరంగల్ ఉప ఎన్నిక: ఈసీ వినూత ప్రయోగాలు, కెసిఆర్ ప్రభుత్వానికి రెఫరెండమా?
వరంగల్: వరంగల్ లోకసభ స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారమే పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడారు. గత ఏడాది జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయడానికి 800 మంది విద్యార్థులను నియమించామన్నారు.
ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఓటర్లకు చీటీలు ఇప్పటికే ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు.
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఎన్నికల ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన అన్ని పార్టీల నాయకులు వెళ్లిపోయారన్నారు. బల్క్ ఎస్సెమ్మెస్లను కూడా శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు నిషేధించినట్లు చెప్పారు. మద్యం దుకాణాలు మూసివేయించామన్నారు.
బరిలో 23 మంది అభ్యర్థులు
వరంగల్ ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. 1778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 626 పోలీస్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో గ్రాఫర్లు ఉంటారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘలు జరగకుండా 240 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు తరలిస్తారు. 12వేల మందికి పైగా కేంద్ర, రాష్ట్ర భద్రతా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.. 631 మైక్రో అబ్జర్వేటర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బంది 7,160.
ఇదిలా ఉండగా, వరంగల్ ఉప ఎన్నికలో ఈసీ అనేక వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటరుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకడం, ఈవీఎంలలో పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి ఫోటోలను ఏర్పాటు చేయడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకం. పోలింగ్ సిబ్బందికి చక్కని భోజనం కల్పించే వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. మినరల్ వాటర్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.
కాగా, వరంగల్ ఉప ఎన్నికలు కెసిఆర్ ప్రభుత్వానికి రెఫరెండం అని కడియం శ్రీహరి చెప్పగా, మరికొందరు ఇది రెఫరెండం కాదని చెప్పారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని బట్టి గత మెజార్టీని దాటుతుందా లేదా అని తెలుస్తుందని చెబుతున్నారు. టిఆర్ఎస్ ఓడినా, మెజార్టీ తగ్గినా... ఇది కెసిఆర్ ప్రభుత్వానికి రెఫరెండమే అంటున్నారు.