వరంగల్ నిట్ విద్యార్థికి ఎంఎన్సీలో కొలువు: ఊహించని ప్యాకేజీ!
వరంగల్ నిట్లో ఈసీఈ విభాగంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి ఊహించని ప్యాకేజీతో ఓ బహుళజాతి కంపెనీలో కొలువు లభించింది.
హన్మకొండ: అత్యధిక ప్లేస్మెంట్లతో దూసుకుపోతున్న వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్ఐటీ)లో ఈసీఈ విభాగంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి ఊహించని ప్యాకేజీతో ఓ బహుళజాతి కంపెనీలో కొలువు లభించింది. అతనికి వార్షిక జీతం రూ.80 లక్షల ప్యాకేజీ ఇచ్చి అమెరికాకు చెందిన మోర్గాన్ స్టాన్లీ కంపెనీ ఎంపిక చేసుకుంది.
నిట్ క్యాంపస్లో చేపడుతున్న ప్రాంగణ ఎంపికల్లో భాగంగా అత్యధిక ప్యాకేజీతో నిట్ విద్యార్థికి ఈ కొలువు లభించడం విశేషం. నిట్లో చదువుతున్న విద్యార్థులు 90 శాతం మంది కొలువులకు ఎంపికవుతున్నట్లు నిట్ ప్రొఫెసర్లు తెలిపారు. ఐదేళ్లుగా ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పెప్సీకో తదితర కంపెనీలలో ఏడాదికి రూ.50 నుంచి 65 లక్షల ప్యాకేజీలతో విద్యార్థులు కొలువులకు ఎంపికవుతున్నారని చెప్పారు.
కంప్యూటర్సైన్స్, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు రూ.10లక్షల కంటే అధిక ప్యాకేజీలతో 90శాతానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కించుకుంటున్నారని వెల్లడించారు.
సాధారణంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ సంస్థలు అత్యధిక ప్యాకేజీలు ఆఫర్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఈసీఈ విద్యార్థిని స్టాక్ ఎక్చేంజ్(ఫైనాన్షియల్) కంపెనీ అత్యధిక ప్యాకేజీతో ఎంపిక చేసుకోవడం విశేషమనే చెప్పుకోవాలి.