వరంగల్లో వైసిపి, లెఫ్ట్ను దాటిన 'శ్రమజీవి': 'ఉపఎన్నిక ఫలితం నిలిపేయండి'
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన శ్రమజీవి పార్టీ అభ్యర్థి భాస్కర్... వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు బలపర్చిన అభ్యర్థిని దాటేశారు. ఉప ఎన్నికల్లో ఆయన వీరి కంటే ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం.
శ్రమజీవి పార్టీ తరఫున జూజుల భాస్కర్ పోటీ చేశారు. ఆయన టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. వామపక్షాలు బలపర్చిన అభ్యర్థి ఆరో స్థానంలో నిలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐదో స్థానంలో నిలిచారు.
శ్రమజీవి పార్టీ అభ్యర్థి భాస్కర్ 28,541 ఓట్లు సాధించారు. వైసిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు 23,352 ఓట్లు మాత్రమే వచ్చాయి. వామపక్షాలు బలపర్చిన గాలి వినోద్ కుమార్కు 14,788 ఓట్లు వచ్చాయి.
ఉప ఎన్నికల ఫలితం నిలిపేయండి: ఫిర్యాదు
ఉప ఎన్నిక ఫలితాన్ని నిలిపివేయాలని బిజెపి అభ్యర్థితో పాటు పలువురు రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆమెను కలిశారు.
ఉప ఎన్నికల్లో వినియోగించిన ఈవిఎంలను రీసెట్ చేయడంలో అనుమానాలున్నాయని బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఏజెంట్ శ్రీనివాస్ రావు, స్వతంత్ర అభ్యర్థులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈవిఎం సాఫ్టువేర్లో ట్యాంపరింగ్ జరిగిందని ప్రోగ్రాం ముందే సెట్ చేశారని ఆరోపించారు.
అందుకే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఒకేవైఫు ఫలితాలను చూపాయన్నారు. ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. పరకాల మండలం వరికోలు గ్రామంలో అసాధారణ రీతిలో పోలింగ్ జరిగిందని, దీనిపై అనుమానాలున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి ఏజెంట్ శ్రీనివాస రావు రిటర్నింగ్ ఫిర్యాదు చేశారు.
ఊరంతా టీఆర్ఎస్కు ఓటేశారు
ఆత్మకూరు మండలం వెంకటాపురం, పరకాల మండలంలోని వరికోలులో టిఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ రెండు గ్రామాల్లో పోలైన 2896 ఓట్లలో 2839 ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థికి పడ్డాయి.
వెంకటాపురంలో 464 ఓట్లు ఉండగా 432 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 394 టిఆర్ఎస్కు, 19 కాంగ్రెస్కు, ఐదు బిజెపికి పడ్డాయి. వరికోలులో 2735 ఓట్లు ఉండగా 2464 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్కు 2445, బిజెపికి ఆరు, కాంగ్రెస్కు నాలుగు, వైసిపి రెండు ఓట్లు పడ్డాయి. ఇతరుకు ఏడు ఓట్లు పడ్డాయి.