కేసీఆర్ను ‘చిన్న మోడీ’గా అభివర్ణించిన కాంగ్రెస్: గుణపాఠం కావాలన్న దత్తన్న
హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో నామినేషన్ గడువు ముగియడంతో ప్రాచరం ఊపందుకుంది. ప్రచారంలో పార్టీల నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేఫథ్యంలో సోమవారం గాంధీ భవన్ వేదికగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాహాకూటమి ఘన విజయం సాధించినందుకు సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మధు యాష్కీ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, మల్లు రవి తదితరులు సీఎం కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ నేతలు ‘చిన్న మోడీ'గా అభివర్ణించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి ఎదురుదెబ్బ తగిలినట్లే, వరంగల్ ఉపఎన్నికలో ‘చిన్న మోడీ'కి ఓటమి తప్పదని వారు తేల్చి చెప్పారు.
గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. బీహార్ ఎన్నికల్లో మోడీకి బుద్ధి చెప్పినట్లే, వరంగల్ ఉప ఎన్నికలో కేసీఆర్కు కూడా గుణపాఠం తప్పదని వారు జోస్యం చెప్పారు.
మరోవైపు బీజేపీ, టీడీపీ నేతలు సైతం వరంగల్ ప్రాచార జోరుని పెంచారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక మాగార్డెన్స్లో టిడిపి, బిజెపిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి దత్తాత్రేయ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించిన కెసిఆర్కు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
సీఎం పదవి కాకుండా దళితునికి ఉప ముఖ్యమంత్రి పదివిని కట్టబెట్టిన కెసిఆర్ పట్టుమని ఆరునెలలు గడవకముందే అర్ధరాత్రి బర్తరఫ్ చేసిన ఘనుడు సిఎం అని ఆయన విమర్శించారు. అలాంటి వ్యక్తిగత నీచ రాజకీయాలతోనే నేడు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక రావడం జరిగిందన్నారు.
అందుకు టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఓటు వేస్తారో ప్రజలే గమనించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే మండలాలను గుర్తించి కేంద్రానికి పంపాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికి వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం వారి కుటుంబాల పరిస్థితిని ఆలోచించని ముఖ్యమంత్రి, ఉప ఎన్నికల ప్రచారానికి మాత్రం రాష్ట్ర మంత్రులను మాత్రం జిల్లాలోనే మకాం పెట్టించాడని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏమేరకు అమలు చేశాడని ప్రశ్నించారు.
ఉప ఎన్నికలో టిడిపి బలపర్చిన బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యను ప్రజలు ఆదరించి గెలిపించాలని, ఆయన గెలిస్తే వరంగల్ను అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తామని టిడిఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. సోమవారం మండలకేంద్రంలో టిడిపి, బిజెపి శ్రేణులతో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.