చోరీకి వచ్చి శరత్ను కాల్చాడు, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు: ఫ్యామిలీకి కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్ రెస్టారెంటులో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన శరత్ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం పరామర్శించారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. మంత్రులు వారికి సానుభూతి తెలిపారు.
అమెరికాలో వరంగల్ విద్యార్థి హత్య, రెస్టారెంటులో దుండగుడి కాల్పులు
శరత్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు. శరత్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, శరత్ కుటుంబ సభ్యులు ఎవరైనా అమెరికా వెళ్తే వీసా ఏర్పాటు చేస్తామన్నారు. కాల్పులు ఎవరు జరిపారనే విషయమై సరైన సమాచారం లేదని కడియం అన్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అనుమానితుడిని పట్టిస్తే 10వేల డాలర్లు
దుండగుడి ఫోటోలను కన్సాస్ పోలీసులు విడుదల చేశారని కడియం శ్రీహరి తెలిపారు. అనుమానితుడిని పట్టించిన వారికి 10 వేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారని తెలిపారు. కాగా, శరత్ను కాల్చి చంపింది ఇతడే అంటూ కన్సాస్ పోలీసులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అతని సమాచారం ఇస్తే 10 వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అనుమాతుడి వీడియోతో పాటు రివార్డు విషయాన్ని కన్సాస్ పోలీసులు తమ ట్విటర్లో పోస్ట్ చేశారు.
దోపిడీ క్రమంలో హత్య
జేస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్లో కొందరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శరత్ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. మిగతా వారు వచ్చేలోపు దుండగుడు పారిపోయాడు.యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ నుంచి శరత్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. దోపిడీ క్రమంలో ఈ హత్య జరిగిందని, జాతి విద్వేష కోణంలో అనుమానాలు లేవని అధికారులు తెలిపారు.
చోరీకి వచ్చి కాల్పులు జరిపాడు
రెస్టారెంటులో పని చేస్తున్న సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం శరత్ పైన కాల్పులు జరిపిన వ్యక్తి చోరీకి వచ్చాడు. అది అడ్డుకోబోవడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని తెలిపారు. తుపాకీ చూపిన వెంటనే దుండగుడి నుంచి తప్పించుకోబోతుండగా అతడు కాల్పులు జరపడంతో శరత్ వెనక వైపు బుల్లెట్లు తగిలాయని, వెంటనే అక్కడే ప్పకూలిపోయాడని తెలిపారు. 911కు ఫోన్ చేసేలోపు దుండగుడు పారిపోయాడన్నారు.
తాత్కాలికంగా ఉద్యోగం
శరత్ స్వస్థలం వరంగల్ కరీమాబాద్. తండ్రి రామ్మోహన్ హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖలో ఈవోఆర్డీగా పని చేస్తున్నారు. రామ్మోహన్ కుటుంబంతో హైదరాబాద్ అమీర్పేటలోని ధరంకరం రోడ్డులో ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. శరత్ ఎంఎస్ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరం ప్రాస్పెక్ట్స్ అవెన్యూలోని జేఎస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ అనే ఓ రెస్టారెంటులో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు.
ఇండియన్ ఎంబసీ అధికారులతో కేటీఆర్
కాగా, మంత్రి కేటీఆర్ అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. శరత్ మృతదేహం భారత్ వచ్చేందుకు నాలుగు రోజుల సమయం పడుతుంది. తల్లిదండ్రులను పంపించేందుకు వీసా ఏర్పాటు చేస్తామని చెప్పగా, వారు ఇప్పుడు వెళ్లే పరిస్థితుల్లో లేరు. శరత్ కుటుంబ సభ్యులు ఊరుకుంచడం ఎవరి వల్ల కావడం లేదు. మంత్రులను చూడగానే కన్నీరుమున్నీరయ్యారు.