వరంగల్ యువకుడి ఆత్మహత్యా యత్నం.. ఫేస్బుక్లో లైవ్!
వరంగల్: సిరియాలో నరమేధానికి వ్యతిరేకంగా ఓ యువకుడు తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఏకంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఉదంతమిది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.
ముస్లిం హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నయీం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అంతేకాదు ఈ ఘటనను అతడు ఫేస్బుక్ లైవ్లో పెట్టాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే... వరంగల్లోని మచిలీబజార్కు చెందిన ఎండీ నయీం.. సిరియాలో జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ స్థానిక జేపీఎన్ రోడ్డులో శాంతి ర్యాలీ నిర్వహించాలని భావించాడు. అయితే ఒకవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండడం, మరోవైపు జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో పోలీసులు నయీం తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నయీం తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవాలని ప్రయత్నించగా కొంతమంది అతడ్ని అడ్డుకున్నారు. ఆ తరువాత మరికొంతమందితో కలిసి తన ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ నయీం మట్టెవాడ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అయినా పోలీసులు అతడి ర్యాలీని అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో నయీం మరికొందరితో కలిసి జేపీఎన్ రోడ్డులోని ఓ హోటల్కు చేరుకున్నాడు. పోలీసుల వైఖరికి నిరసనగా తన వెంట తెచ్చుకున్న పాయిజన్ తాగేశాడు. అతడు ఈ ఘటనను ఫేస్బుక్ లైవ్లో పెట్టడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నయీంను అతడి అనుచరులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నయీం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.