ఏపీ బాటలో..మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు: కేటీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ఏపీ బాటలో నడుస్తుంది. ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి విలేజ్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మునిసిపాలిటీలలో వార్డు ఆఫీసర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, వార్డ్ ఆఫీసులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునిసిపాలిటీలపై శ్రద్ధ పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడారు . హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్ కు క్రమం తప్పకుండా నిధులను ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. జిహెచ్ఎంసిలో ఎస్ఆర్డిపీ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
లాక్డౌన్ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించిన కేటీఆర్ త్వరలోనే మున్సిపల్ వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని ప్రకటించారు. మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాలపరిమితి అని పేర్కొన్న కేటీఆర్, వార్డ్ ఆఫీస్ కార్యాలయాలను కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డ్ ఆఫీసర్స్ కలిసి పని చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వార్డు ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ లాగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హైదరాబాద్ అభివృద్ధి గురించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన ప్రణాళికలను ప్రకటిస్తుండడం గమనార్హం.