తుమ్మల , ఎర్రబెల్లికి తలంటిన కేసీఆర్ ? ఓటర్లను తిట్టిన ఫలితం !?
తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు అంటూ , ప్రచారంలో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహరించాలంటూ సీరియస్ అయ్యారు. ఇక పోలింగ్ కు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నోరు జారుతున్న మంత్రులు, నేతలు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ మంత్రులు, నేతలు నోరు జారుతున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరికి ఓటు వేసినా తిరిగి వారు టిఆర్ఎస్ పార్టీ లోకి వస్తారు అంటూ మాట్లాడుతున్న నేతలు టిఆర్ఎస్ కు తప్ప ఎవరికి ఓటు వేసిన మీ ఓటు మురిగి మురికి కాలువలో పడినట్టే అని అవాకులు చెవాకులు పేలుతున్నారు. మొన్నటికి మొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూపాలపల్లి లో జరిగిన సభలో అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుచేసిన భూపాలపల్లి ప్రజలు ఈసారైనా తప్పు దిద్దుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే భూపాలపల్లి జిల్లా కేంద్రం తరలిపోతుందని హెచ్చరించారు.దీంతో నేతల హెచ్చరికలపై ప్రజల్లో చర్చ మొదలైంది.
ఎన్నికల ప్రచారంలో దయాకర్ రావు బెదిరింపులు, తుమ్మల తిట్ల దండకాలు
ఇక అలాగే ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని, ఈ ఎన్నికల్లో తప్పు దిద్దుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి వర్యులు ఎర్రబెల్లి . అంతేకాదు టిఆర్ఎస్ ను కాదని ఇతర పార్టీల నాయకులను గెలిపిస్తే వచ్చిన లాభం ఎంతో చెప్పాలని, వారంతా మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారని ప్రజలనే ఎద్దేవా చేశారు. ఇక మాజీ మంత్రి తుమ్మల గత ఎన్నికల్లో నాకు చేసినట్టే, నన్ను ఓడించినట్టే నామా నాగేశ్వరరావు ను మీరు ఓడిస్తే కుక్కలు కూడా పట్టించుకోవడం టూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు.
లోకసభ ఎన్నికలు 2019: జోరుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం
నోరు జారొద్దని ప్రగతిభవన్ నుండి వార్నింగ్స్
టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు, ప్రజలపై తిట్ల దండకాలు కురిపిస్తున్న వైనంపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్ నుండి నేతలకు సీరియస్ వార్నింగ్స్ వెళ్లాయి.
అధికార పార్టీలోని మంత్రులు, నేతల తీరుతో టిఆర్ఎస్ హైకమాండ్ స్పందించింది. నోరు జారొద్దని నేతలను హెచ్చరించింది.
మంత్రులు, నేతల పని తీరుతో అధిష్టానం అసంతృప్తి.. అందుకే హెచ్చరికలు
ఇటీవల సంచలన వ్యాఖ్యలతో మంత్రిగా తన మార్కు చూపించాలి అనుకుంటున్న ఆ మంత్రివర్యులపై , ఒకరిద్దరు సీనియర్ నేతలపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక పార్టీలో ప్రచారం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించేలా, ఆచితూచి మాట్లాడేలా సూచనలు చేయాల్సిందిగా కొందరు ముఖ్య నేతలకు టీఆర్ఎస్ అధిష్టానం ఆ బాధ్యతను అప్పగించింది. మొత్తం మీద మంత్రులు, ముఖ్య నేతల నోరు జారుడు వ్యవహారం ఈ ఎన్నికల్లో పార్టీకి చేటు చేస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.