84 మంది ఏకగ్రీవ విజయంతో మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ముందున్నాం: టీఆర్ఎస్
హైదరాబాదు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రచారంను హోరెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఎన్నికల్లో తాము ఇప్పటికే ముందంజలో ఉన్నట్లు ప్రకటించింది.గులాబీ పార్టీకి చెందిన 84 మంది సభ్యులు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరితేదీ ముగిశాక అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
మరోవైపు విపక్షాలు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే బరిలో నిలుస్తున్నాయని టీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. బీజేపీకి 700 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ 400 వార్డుల్లో పోటీ చేయడం లేదని సమాచారం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మరింత బలోపేతంగా మారుతుందని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఒక డివిజన్లో ఏకగ్రీవ విజయం దక్కిందని పార్టీ సెక్రటరీ గట్టురామచంద్ర రావు అన్నారు. ఇప్పటికే పరకాల మరియు చెన్నూరు మున్సిపాలిటీలు తమ ఖాతాలో ఉన్నాయని రామచంద్రరావు అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎలా అయితే ఖంగుతినిందో... ఇప్పుడు కూడా అదే ఫలితాలు గులాబీ పార్టీకి దక్కుతాయని చెబుతున్న విపక్షాల మాటలను రామచంద్రరావు కొట్టి పారేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా అయితే టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందో అదే మాదిరిగా ఈ సారి కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఇక ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని పార్టీలు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ఆన్లైన్ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్ ద్వారా ప్రజలతో ముచ్చటించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను ప్రచారం నిమిత్తమై నియమించారు.