ఆ అభిప్రాయం కల్పించలేకపోయారు, పారిపోయారని చెప్పడమేమిటి: జానారెడ్డి
ప్రజల తరపున తాము అసెంబ్లీలో పోరాటం చేశామని సిఎల్ పి నేత జానారెడ్డి చెప్పారు.
హైద్రాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న కొత్త భూసేకరణ చట్టం రైతులకు ఎలాంటి నష్టం చేయదనే అభిప్రాయాన్ని కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిఎల్ పి నాయకుడు, అసెంబ్లీలో ప్రధాన పక్షనేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో తమ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బుదవారం నాడు తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీలో తమ పార్టీ ఏ రకంగా ప్రజా సమస్యలను ప్రస్తావించిందనే అంశాలను ప్రస్తావించారు.
కొత్త భూసేకరణ చట్టం ద్వారా ఏ మేరకు రైతాంగ సమస్యలు తీరుతాయోననే విషయమై ప్రభుత్వం నుండి తమకు స్పష్టత రాలేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. 2013 భూసేకరణ చట్టాన్ని విఘాతం కలగకుండా ఈ చట్టం ఉండాలనేదే తమ అభిమతమని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ విషయంలో రైతాంగానికి కాని, తమకు కాని సరైన వివరణ ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు బకాయిల చెల్లింపు విషయాన్ని ఆయన ప్రస్తావించారు . ఈ అంశాన్ని తాము అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని ఆయన గుర్తుచేశారు. లబ్దిదారులకు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లబ్దదారుల విజయంగా ఆయన చెప్పారు.
ఎస్ సి ఎస్ టి సబ్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఏ లక్ష్యం కోసమైతే ఈ చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం ప్రచార ఆర్భాటంగా మారిందని జానారెడ్డి విమర్శించారు.ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
మరో వైపు విపక్షాలు పారిపోయాయని ప్రభుత్వం ఆరోపించడం సరైంది కాదన్నారు జానారెడ్డి. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను విపక్షాలు తమ పాత్రను నిర్వర్తించాయన్నారు జానారెడ్డి.