భోజనం చేశాక బాగా మాట్లాడుకోవచ్చు: కెసిఆర్, మరి మీరొస్తారా: జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రెండో రోజు భోజన విరామానికి ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.
రైతుల సమస్యల విషయమై తాను సలహాలు ఇవ్వాలనుకుంటున్నానని జానా రెడ్డి చెప్పారు. అయితే, తన సలహా సుదీర్ఘంగా ఉంటుందని, మీకు అభ్యంతరం లేకుంటే సగం ఇప్పుడు, మరో సగం భోజనం చేసి వచ్చిన తర్వాత ముగిస్తానని సభలో అన్నారు.
లేదంటే సభ్యులు భోజనం పూర్తిగా చేశాకే మాట్లాడుతామని చెప్పారు. దీనిపై కెసిఆర్ స్పందిస్తూ... భోజనం చేశాకనే బాగా మాట్లాడుకుందామని చెప్పారు. విస్తృతంగా చర్చించుకుందామన్నారు. అందుకే భోజనం తర్వాత మీరు సలహాలివ్వాలని సూచించారు.
అందుకు జానా రెడ్డి స్పందిస్తూ... భోజనం చేశార మీరూ వస్తారా అని అడిగారు. నేను తప్పకుండా వస్తానని కెసిఆర్ చెప్పారు. అందరం చర్చించుకుందామని, భోజనం చేసి వద్దాం సమస్య లేదు అన్నారు. అనంతరం సభాపతి అరగంటపాటు సభను వాయిదా వేశారు.
అంతకుముందు, రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ శాసనసభలో రెండోరోజు చర్చ జరిగింది. తొలిరోజుకు కొనసాగింపుగా రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సుదీర్ఘ చర్చ చేపట్టారు.