కేసీఆర్ మద్దతు వెనుక.., గాలి జనార్ధన్ మాటేమిటి: మోడీ దుమ్ముదులిపిన జైపాల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కారణంతో నోట్ల రద్దు పైన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారో, ఏం ఆశించి ఆయన స్వాగతిస్తున్నారో తెలియదని జైపాల్ రెడ్డి మంగళవారం అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ కారణంతో నోట్ల రద్దు పైన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారో, ఏం ఆశించి ఆయన స్వాగతిస్తున్నారో తెలియదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మంగళవారం అన్నారు.
నోట్ల రద్దు వల్ల కొనుగోలు శాతం తగ్గిందన్నారు. కొత్త నోట్లు ప్రింట్ చేసినందుకు రూ.25వేల కోట్ల ఖర్చు అన్నారు. కానీ అంత మొత్తం నల్లధనం కూడా బయటకు రాలేదన్నారు. నోట్ల రద్దు వల్ల మంచి జరుగుతుందేమోనని ప్రజలు ఎదురు చూశారన్నారు.
మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మోడీ నిరంకుశంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ప్రధాని మోడీ నోట్ల రద్దు పైన ఆర్బీఐని సంప్రదించారా అని నిలదీశారు. నోట్ల రద్దు ఇప్పుడే వద్దని ఆర్బీఐ చెప్పిందన్నారు. ఇది ఆర్థిక నిరంకుశత్వం అన్నారు.
నల్లధనం దొరికినా బ్యాంకుల్లో ప్రజలకు వేయలేరు
నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. నల్లధనం దొరికినా ప్రజల బ్యాంకులలో వేయడం కుదరదని చెప్పారు. రూ.వేల కోట్ల కొత్త నోట్లు ఎలా బయటకు వస్తున్నాయో చెప్పాలన్నారు.
కేసీఆర్లా దిగజారను
కేసీఆర్ స్థాయిలో దిగజారుడు అంటే మాలాంటి వాళ్లకు తగదన్నారు. కేసీఆర్ బీజేపీతో ఎందుకు కలుస్తారో, ఎప్పుడు బీజేపీతో కలుస్తారో మనం చెప్పలేమన్నారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో, ఎందుకు నోట్ల రద్దుకు అనుకూలంగా మాట్లాడుతున్నారో తెలియదన్నారు.
మే వరకు నోట్ల కష్టాలు
వచ్చే ఏడాది మే నెల వరకు నోట్ల రద్దు కష్టాలు తప్పవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలకు కష్టాలు తీసుకు వచ్చే ప్రధాని ఇప్పటి దాకా ఎవరూ లేరన్నారు. నోట్ల రద్దు అనంతరం చట్టాన్ని 108సార్లు మార్చారని దుయ్యబట్టారు. దేశంలో నల్లధనం లేదని మోడీ తేల్చబోతున్నారన్నారు.
గాలి జనార్ధన్, గడ్కరీ ఇళ్లలోని పెళ్లిళ్లకు వర్తించవా?
నోట్ల రద్దు వల్ల సంపన్నులు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదని, సామాన్యులే కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పెళ్లి నిబంధనలు మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇళ్లలోని పెళ్లిళ్లకు, వారి ఆడంబరాలకు వర్తించవా అని నిలదీశారు.