స్పష్టంగా ఉన్నాం: కెటిఆర్, ప్రాణాలు తీస్తోందన్న డికె
హైదరాబాద్: ఆసరా పాలసీ స్పష్టంగా ఉందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ వికలాంగులున్నా, వితంతువులు ఎంతమంది ఉన్నా పింఛన్కు అర్హులేనన్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరు వృధ్ధులుంటే ఒకరే అర్హులని తెలిపారు. తాము గతంలో ఉన్న పాలసీనే అమలు చేస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. 40 శాతంపైగా వైకల్యం ఉన్న వికలాంగులందరికీ రూ. 1500 పెన్షన్ ఇస్తున్నామని, మిగితా అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని తెలిపారు. దేశం మొత్తంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తేల్చి చెప్పారు. అసత్యాల మాటలతో సభను తప్పుదోవ పట్టించి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని కేటీఆర్ హితవు పలికారు.
అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వివరణ ఇస్తూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ఆహార భద్రత కార్డులు ఇస్తామన్నారు. అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం రాజయ్య... వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టే యోచన ప్రభుత్వానికి లేదన్నారు. పెన్షన్ల కోసం బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
నిబంధనలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి: డికె
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే తప్పుల తడకగా సాగిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. పింఛన్లు ఇవ్వడానికి సర్కారు పెట్టిన నిబంధనలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడ్డారు. పెన్షన్లు రానివారు ఇంకా చాలా మంది ఉన్నారని అరుణ తెలిపారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పింఛన్లనే ఆసరా పథకంగా తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చిందని డికె అరుణ అన్నారు. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని ఆమె చెప్పారు.
నిబంధనలు కఠినంగా ఉన్నాయి: లక్ష్మణ్
ఆసరా పథకం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, దరఖాస్తుల విచారణ ఆలస్యమవుతోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆసరా పథకంపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
ప్రజా సంక్షేమం కోసమే తాము వాయిదా తీర్మానాలు ఇస్తున్నామని అన్నారు. పింఛను రాలేదనే మనస్తాపంతో 18మంది చనిపోయారని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రంలో వృద్ధుల మరణాలు మంచివి కావనే వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు.