రాహుల్ను మర్యాదపూర్వకంగానే కలిశాం : హైకోర్టుకు అనర్హత గురైన ఎమ్మెల్సీలు, విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై బుధవారం పిటిషనర్ల వాదనను హైకోర్టు ధర్మాసనం ఆలకించింది. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్ అనర్హత వేటు వేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ పిటిషన్ల వాదనలను ధర్మాసనం రికార్డు చేసింది. ప్రభుత్వ వాదనలను రేపు వింటామని విచారణను వాయిదావేసింది.
అబ్బే చేరలేదే ..?
తమ పిటిషనర్లు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వారి తరఫు లాయర్ సల్మాన్ ఖుర్జీద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వారు మర్యాదపూర్వకంగానే కలిశారని పేర్కొన్నారు. అయితే వారి భేటీపై కొన్ని మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేసి .. తప్పుదోవ పట్టించాయని తెలిపారు. పిటిషనర్ల తరఫున వాదనలు రికార్డు చేసిన హైకోర్టు .. గురువారం ప్రభుత్వం వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదావేసింది.
నేటితో గడువు పూర్తి ..
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీ వరకు జారీచేయొద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఇదివరకే ఆదేశించింది. ఆలోగా ఎమ్మెల్సీల అనర్హతకు సంబంధించిన పత్రాలను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి కూడా స్పష్టంచేసింది. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాళ పిటిషినర్ల వాదనలు విని .. రేపు ప్రభుత్వం తరఫు వాదనలు ఆలకించి తీర్పును హైకోర్టు ఎప్పుడ వెల్లడిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్దేశిత సమయం ప్రకారం బుధవారంతో సమయం ముగిసినందున ఈసీ నోటిఫికేసన్ విడుదల చేస్తోందా లేదా అనే టెన్షన్ కొనసాగుతోంది.
పార్టీ మారడంతో సస్పెన్షన్
భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలనే అభియోగం కింద చర్యలు తీసుకున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండలి చైర్మన్ కు విజ్ఞప్తి చేసింది. దీంతో చైర్మన్ స్వామిగౌడ్ వారిపై అనర్హత వేటు వేశారు. ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.