అమ్మ అంటే అప్యాయత, నాన్న నమ్మకం, తెలుగు మరవొద్దు: సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడు
పాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను మరచిపోతున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ భాషలో చదివిన మాతృభాషను మరచిపోవద్దని సూచించారు. మాతృభాష కళ్ల లాంటిదని.. ఇతర భాష కళ్లద్దాలు లాంటి దని పేర్కొన్నారు. కళ్లే పనిచేయనప్పుడు రేబాన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫలితం ఉండదని చెప్పారు. ఇతర భాషలో చదువుకొంటే మంచిదేనని.. కానీ మాతృభాషను మాత్రం మరవొద్దని హితవు పలికారు. గురువారం శిల్పకళావేదిలోక స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
దేశ భాషలందు..
తెలుగుభాష గురించి వెంకయ్యనాయుడు వివరించారు. తెలుగు అమృతతల్యం అని, వినసొంపైన మాధుర్యం అని చెప్పారు. సంగీతానికి కూడా అనువైన భాష అని చెప్పారు. అష్టవధానం, శతవధానం, సహస్రవదానం ఏ భాషలో లేదని.. ఒక్క తెలుగులోనే ఉందని గుర్తుచేశారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మరచిపోయిన వాడే మానవుడే కాదన్నారు.
అప్యాయత, అనురాగం
అమ్మ అంటే అప్యాయత, నాన్న నమ్మకం, తాత తన్మయత్వం, అమ్మమ్మ అభిమానం, నానమ్మ నవ్వు మొహం, అత్త ఆదరణ, మామ మామకారం, బాబాయ్ బంధుత్వం, చిన్నమ్మ చనువు, అన్న అభయం, ఆదరణ, తమ్ముడు తీయదనం, అక్కా అనురాగం, బావ బాంధవ్యం, మాధుర్యం, వదిన ఓర్పు, మరదలు మర్యాద, మరిది, మానవత్వం, గురువు గౌరవం అని కవి వర్ణించిన విధానాన్ని వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. కానీ ఇంగ్లీషుకాలంలో వచ్చిన ఆలోచనలు మాత్రం మారడం లేదన్నారు.
మాతృభాషలోనే..
సంక్రాంతి పండగ సందర్భంగా ఇక నుంచి మీ పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూడాలని వెంకయ్యనాయుడు సూచించారు. మాతృ భాషను మరచిపోతే భావ వ్యక్తీకరణ చేయలేమన్నారు. పిల్లలకు భాష, యాస, కట్టు, బొట్టు, అప్యాయత, అనురాగం పంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
మహాదానందం..
సమాజంలో కష్టాలు నష్టాలు సహజమని.. కానీ తమ సంపాదనలో కొంద ఇతరులకు దానం చేయడమే గొప్ప అని వెంకయ్యనాయుడు తెలిపారు. మనకోసం మనం పనిచేస్తే ఆనందం అని, ఇతరుల కోసం పనిచేస్తే మహాదానందం అని తన గురువు చెప్పారని గుర్తుచేసుకున్నారు.
సేవా కార్యక్రమాల్లో..
రాజకీయాల్లో వారసత్వాన్ని తాను ప్రోత్సహించనని.. కానీ సేవా కార్యక్రమాల్లో మాత్రం ఎంకరేజ్ చేస్తానని వెంకయ్యనాయుడు తెలిపారు. తన కూతురు, కుమారుడు, మనుమలు, మనమరాళ్లు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. మానవసేవే మాధవసేవ అని.. దానిని విశ్వసించి సేవా కార్యక్రమాలను చేపట్టానని వివరించారు. తన జీతాన్ని స్వర్ణభారత్, ముప్పవరపు ఫౌండేషన్కు ఇస్తానని వెంకయ్యనాయుడు ప్రకటించారు. సంక్రాంతి సంబురాల్లో సినీనటులు వెంకటేశ్, మహేశ్ బాబు, బీజేపీ నేత సుజనాచౌదరి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.