కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువు.. రెబల్స్ పనిపడుతాం.. కేటీఆర్ సెటైర్
అసంతృప్త నేతలను కలుపుకొని కోవాలని అభ్యర్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అలసత్వం వహించొద్దని తేల్చిచెప్పారు. గురువారం మున్నిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రచార సరళి గురించి కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులకు వివరించారు.
ఇంటింటికీ ప్రచారం
ఆయా చోట్ల ప్రచార గడువు ముగిసేలోపు ప్రతీ ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలని కేటీఆర్ కోరారు. వీలైతే ఐదుసార్లు వెళ్లి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి ఓట్లుగా మలచుకోవాలన్నారు. వార్డు, డివిజన్లలో అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టో విడుదల చేయాలన్నారు. దీంతో స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం వల్ల, ప్రజామోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కోసం కూడా పాటుపడతామని చెప్పారు. ఇప్పటికే 70 నుంచి 80 వార్డుల ఏకగ్రీవమయ్యాయని.. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు.
నిధులు
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.2500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని మరోసారి ఉద్ఘాటించారు.
గీత దాటితే..
కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెబల్స్ నుంచి ఎక్కవ బెడద ఉంది. 20 చోట్ల రెబల్స్ బరిలోకి దిగారు. వీరికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతిస్తున్నారని, ఇవాళ ఉదయం కేటీఆర్ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి తీసుకెళ్లారు. పార్టీ టికెట్ ఇచ్చిన వారి కోసం పనిచేయాలని.. రెబల్స్పై చర్యలు తప్పవని కేటీఆర్ స్పష్టంచేశారు. పార్టీ నిర్ణయానని ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అభ్యర్థులే కరవు
ఆయా చోట్ల కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందని కేటీఆర్ చెప్పారు. బీజేపీకి మాత్రం 600 నుంచి 700 డివిజన్లలో అభ్యర్థులే లేరని.. ఎవరైనా సరే టికెట్ ఇస్తామని చెప్పినా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. ఈ విషయం తాను చెప్పడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలను గుర్తుచేశారు.