ఆంగ్లో ఇండియన్లు వద్దట.. థర్డ్ జెండర్ కావాలట.. ప్రధాని మోడీకి రేవంత్ లేఖ, అందుకే లేఖనా...?
చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసిరి. రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్లో చోటు కల్పిస్తారు. కానీ వారి ప్రాతినిధ్యం అవసరం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాశారు.
ఎందుకంటే..
చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల స్థానంలో థర్డ్ జెండర్స్కి రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆంగ్లో ఇండియన్ కోటాను థర్డ్ జెండర్లకు దక్కేలా సవరణ చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు శీతకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఆర్టికల్ 334(బీ) సవరించాలని కోరారు.
కారణమిదేనా..?
సడెన్గా రేవంత్ రెడ్డి థర్డ్ జెండర్స్ పేరు తెరపైకి తీసుకురావడం చర్చకు దారితీసింది. వారిపై ఆయనకు నిజంగా మంచి అభిప్రాయం ఉందా అనే డిస్కషన్ జరుగుతుంది. లేదంటే ఓటుకు నోటు కేసులో తనను రెడ్ హ్యాండెడ్గా పట్టించిన స్టీపెన్ సన్ను దృష్టిలో ఉంచుకొని కామెంట్ చేశారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
భిన్నకోణాలు
రేవంత్ వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. రేవంత్ బాగా ఆలోచించారని ఒకరు అంటే.. అదేం లేదు స్టీపెన్ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యలు చేశారని మరికొందరు ముక్తాయిస్తున్నారు. దీంతో రేవంత్ మదిలో ఏముంది ? ఎందుకీలా కామెంట్ చేశారన్నది చర్చానీయాంశమైంది.
ఇదీ కేసు..
మూడేళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ను టీడీపీ ప్రలోభాలకు గురిచేసింది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తే రూ.5 కోట్లు ఇస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి నగదుతో స్టీపెన్ సన్ ఇంటికి రాగా.. అప్పటికే కాపుకాచిన ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి అండ్ కోను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు స్టీపెన్ సన్తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో కూడా మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే.
బెయిల్పై బయటకు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులపాటు జైలులో కూడా ఉన్నారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. మారిన రాజకీయ సమీకరణాలతో.. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు.