ఆర్ఆర్ఆర్ వివాదం : మీ ఆస్తులను ధ్వంసం చేస్తాం... రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్
ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' టీజర్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. టీజర్ చివరలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకుని కనిపించడంపై బీజేపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దర్శకుడు రాజమౌళికి హెచ్చరిక జారీ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి విడుదల చేస్తే... అడుగడుగునా అడ్డుకుంటామని... సినిమా రీళ్లను తగలబెడుతామని హెచ్చరించారు. అంతేకాదు,బీజేపీ కార్యకర్తలు మీ ఆస్తులను ధ్వంసం చేస్తారు జాగ్రత్త అని రాజమౌళిని హెచ్చరించారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
మరోసారి హెచ్చరించిన సోయం బాపురావు..
ఇదే వివాదంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మరోసారి ఘాటుగా స్పందించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో కుమ్రం భీమ్ 80వ వర్ధంతి వేడుకలో పాల్గొన్న ఆయన... ఆర్ఆర్ఆర్ వివాదంపై స్పందించారు. కుమ్రం భీమ్ వేషధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకోవడం ఆదివాసీలను కించపర్చడమేనని ఆరోపించారు. చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఆ టోపీ పెట్టుకునే సన్నివేశాలను తొలగించాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు.
స్పందించని రాజమౌళి...
గత కొద్దిరోజులుగా వివాదం చెలరేగుతున్న ఈ అంశంపై దర్శకుడు రాజమౌళి ఇంతవరకూ స్పందించలేదు. అయితే ఆ సినిమా మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ మాత్రం... కేవలం టీజర్ మాత్రమే చూసి ఇలా వివాదస్పదం చేయడం సరికాదన్నారు. సినిమాలో ఎన్టీఆర్ను అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో... అసలు సినిమాలో ఏం చెప్తున్నారో తెలుసుకోకుండా ఎందుకు వివాదం చేస్తున్నారని సినీ రంగానికి చెందినవారు అభిప్రాయపడుతున్నారు.
కల్పిత కథ అంటున్న చిత్ర యూనిట్...
మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు,జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కుమ్రం భీమ్... ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందన్న ఒక కల్పిత కథతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిక్షన్ అని చెప్తున్నా... బీజేపీ నేతలు ఇలా వివాదం చేయడం సరికాదని సినీ ఇండస్ట్రీ వాదిస్తోంది. ఆదివాసీ పోరాట యోధుడి పాత్రను చూపిస్తూ... ఫిక్షన్ పేరుతో చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరిస్తోంది. దీంతో మున్ముందు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తోందనన్న చర్చ జరుగుతోంది.