టీడీపీ మీడియాకు లీగల్ నోటీసులిస్తా, టైం ఇస్తా: పవన్, 'అప్పుడు నా వైపు ఎవరూ లేరంటూ' సూక్తి!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతిస్తుందని భావిస్తున్న మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. మంగళవారం ఆయన మరో ట్వీట్ చేశారు. త్వరలో కొన్ని మీడియా ఛానల్స్ హెడ్స్కు లీగల్ నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు.
'వర్మ రూ.5 కోట్ల ఆఫర్, శ్రీరెడ్డితో డ్రామా.. వెనుక ఎవరు? పీఆర్పీలో చూశాం.. పవన్! జాగ్రత్త'
తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే టీవీ ఛానల్స్ హెడ్స్, వారి షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ తదితరులకు లీగల్ నోటీసులు పంపిస్తామని వెల్లడించారు. వారు స్పందించేందుకు సరైన సమయం ఇస్తామని కూడా అందులో పేర్కొన్నారు.
ఎల్లప్పుడు అటువైపే
ఎల్లప్పుడు వాయిస్లెస్, హెల్ప్లెస్ వారి వైపు నిలబడ్డానని పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మార్టిన్ నీమొల్లర్ సూక్తిని పోస్ట్ చేశారు. వాళ్లు కమ్యూనిస్టుల పైకి వచ్చినప్పుడు కమ్యూనిస్టును కాదు కాబట్టి స్పందించలేదు, సోషలిస్ట్ల పైకి వచ్చినప్పుడు నేను కాదు కాబట్టి స్పందించలేదు, ట్రేడ్ యూనియనిస్ట్స్ పైకి వచ్చినప్పుడు స్పందించలేదు, జ్యూస్ల పైకి వచ్చినప్పుడు స్పందించలేదు, కానీ వాళ్లు నా పైకి వచ్చేటప్పటికీ మాట్లాడేందుకు ఎవరూ లేరు.. అని పెట్టారు.
వారి ఫోటో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఇలా
అంతకుముందు, సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో ఓ మీడియా సంస్థ అధినేత కుటుంబ సభ్యులు ఉన్నారు. 'బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి..' అని ఆ ఫ్యామిలీ ఫొటోలో ఉన్న అబ్బాయికి చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం గుడ్నైట్ అని మరో ట్వీట్.
పవన్ కళ్యాణ్కు మద్దతుగా
ఈ ట్వీట్పై పవన్ కళ్యాణ్కు జబర్దస్త్ నటులతో పాటు పలువురు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. 'ఇంకోసారి ఇలాంటి పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాయాలన్నా భయపడాలి సర్.. మీరు అయితేనే చేయగలరు' అని మద్దతుగా నిలిచారు.
రాధాకృష్ణ ఫిర్యాదు
ఇదిలా ఉండగా, తమ సంస్థల పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి, తప్పుడు పోస్టులు పెడుతూ దుష్ప్రచారాలకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఆర్కే ఏబీఎన్' పేరిట ట్విట్టర్లో ఓ నకిలీ ఖాతాను తెరిచారని, తమ లోగో, చానల్ బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్ షాట్లు తీసి వాటిని మార్ఫింగ్ చేసి వివాదాస్పద కంటెంట్ను తయారు చేస్తున్నారన్నారు. పోలీసులు విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తన పేరుతో గానీ, ఆర్కే పేరుతోగానీ ఎలాంటి ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు లేవని రాధాకృష్ణ ఇప్పటికే వెల్లడించారు.