119 స్థానాల్లో ఒంటరిపోరు, అందుకే కెసిఆర్ సర్వేలు, పార్టీ ఎందుకు పెట్టానంటే?: వన్ఇండియాతో కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టిఆర్ఎస్ పాలన సాగడం లేదని, ఈ విషయాన్ని ప్రస్తుతమున్న పార్టీలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రశ్నించడం లేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 సీట్లలో తెలంగాణ జనసమితి పోటీ చేయనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు. కెసిఆర్కు వ్యతిరేకంగా కలిసివచ్చే శక్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జెఎసి ఛైర్మెన్గా ప్రోఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా కోదండరామ్ గొంతెత్తారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జెఎసి అవసరం లేదని టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జెఎసిని విచ్చిన్నం చేసేందుకు టిఆర్ఎస్ వ్యవహరించిందని కోదండరామ్ అభిప్రాయపడుతున్నారు. ప్రజల తరపున పోరాటం చేసేందుకు కొత్తగా రాజకీయపార్టీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
తెలంగాణ జనసమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ వన్ఇండియా వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణ జనసమితి రానున్న రోజుల్లో అవలంభించే వ్యూహలపై కోదండరామ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అన్ని స్థానాల్లో ఓంటరిగా పోటీ
2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. అయితే ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుండి వచ్చే వారి గురించి ఆలోచిస్తామన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో వారు ఏ మేరకు పనిచేశారనే విషయమై పరిశీలించిన మీదటే వారికి ఈ విషయమై అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడే వచ్చే ఎన్నికల్లో ఇతరులతో పొత్తు పెట్టుకొనే విషయంలో ఆలోచన లేదన్నారు.
తెలంగాణ జనసమితికి కారణమిదే
కొత్త పార్టీ ఏర్పాటుకు రాష్ట్రంలో రాజకీయ శూన్యత అవసరం లేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని బట్టి వాళ్ళ స్పృహను బట్టి రాజకీయ అవసరాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు. ఆ స్పృహను రగిస్తే కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. రాజకీయ శూన్యత ఉంటేనే కొత్త రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం సరైంది కాదన్నారు. కొత్త రాజకీయ అవకాశాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే సర్వేలు
ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని తెలంగాణ సీఎం కెసిఆర్ సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నారని ఈ సర్వేల పేరుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. సర్వే కోసం ఎన్ని శాంపిల్స్ సేకరించారు.ఏఏ ప్రాంతాల్లో సర్వే చేశారు, ఏ వయసుల వారి శాంపిల్స్ తీసుకొన్నారనే విషయాన్ని సర్వే ఫలితాల సమయాల్లో ప్రకటిస్తే సర్వేలపై నమ్మకం కుదురుతోందన్నారు. కానీ, కెసిఆర్ ప్రకటిస్తున్న సర్వేల్లో ఆ తరహ వివరాలు ప్రకటించలేదన్నారు. కానీ, ఇతరత్రా సర్వేల్లో మాత్రం కెసిఆర్ సర్వే కంటే భిన్నమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. విపక్షాల బలం పెరుగుతోందని ఆ సర్వేల్లో సమాచారం ఉందన్నారు.
కెసిఆర్ పాలనపై స్పందన నామమాత్రం
తెలంగాణ సీఎం కెసిఆర్ పాలన నిరంకుశంగా ఉందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయపార్టీలు కెసిఆర్ పాలనపై నామమాత్రంగా స్పందిస్తున్నాయన్నారు. ప్రజలు అభిప్రాయాల మేరకు పార్టీలు కెసిఆర్ పాలనను ఎండగట్టడం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. కెసిఆర్కు వ్యతిరేకంగా పార్టీలు మాట్లాడితే వారి వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కారణంగానే కెసిఆర్కు వ్యతిరేకంగా పార్టీలు గట్టిగా ప్రజల తరుపున వాదించడం లేదన్నారు.
ప్రాధాన్యతలు మార్చుకొన్న కెసిఆర్
తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వ్యవహరించిన తీరుకు రాజకీయపార్టీగా టిఆర్ఎస్ను మార్చిన తర్వాత వ్యవహరించిన తీరుకు చాలా తేడా కన్పిస్తోందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో ఇతరులతో కలిసి కార్యాచరణ కోసం కొన్ని సమయాల్లో ప్రయత్నాలు చేసేవారని ఆయన చెప్పారు. కానీ, రాజకీయ పార్టీ టిఆర్ఎస్ రూపాంతరం చెందిన తర్వాత ముఖ్యంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెసిఆర్ ప్రాధాన్యతలు మారిపోయాయని ఆయన చెప్పారు. డబ్బులు సంపాదించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. బలాన్ని పెంచుకొనేందుకు అప్రజాస్వామిక పద్దతుల్లో ముందుకు సాగుతున్నారని కోదండరామ్ నిప్పులు చెరిగారు.
కాంట్రాక్టర్లకే లాభం
కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్గించేలా తెలంగాణ బడ్జెట్లో కేటాయింపులుంటున్నాయని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామాకాలు అనే విషయాన్ని సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను ముందు పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగు నీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సాంకేతికపరంగా సాధ్యం కాని ప్రాజెక్టులను కూడ కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమేనని సర్కార్ ఈ రకంగా వ్యవహరిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే అవసరం లేదన్నారు. తుమ్మిడిహెట్టితో పాటు గోదావరిపై బ్యారేజీలు నిర్మిస్తే ఖర్చు చాలా తగ్గేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
తప్పుడు ప్రచారం
కాంగ్రెస్ పార్టీతో తాను కుమ్మక్కయ్యాయని టిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. అన్నీ తెలిసి కూడ తనపై బురదచల్లేందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు తాను కెసిఆర్కు అనుకూలమనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ తరహ ప్రచారం సరికాదన్నారు.
జెఎసికి, తెలంగాణ జనసమితికి నాయకత్వాలు
తెలంగాణ జనసమితికి, జెఎసికి వేర్వేరు నాయకత్వాలు ఉంటాయని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జెఎసికి, జనసమితికి మధ్య నాయకత్వ మార్పులు ఉంటాయని చెప్పారు. జెఎసి నాయకత్వం చూసేవారు జనసమితి వ్యవహరాల్లో తలదూర్చబోరని ఆయన చెప్పారు. జనసమితిలో పనిచేసేవారు జెఎసిలో పనిచేయరని ఆయన చెప్పారు.