పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి: మాయావతి, ఇదీ జనసేన-బీఎస్పీ పొత్తు లెక్క
Recommended Video
లక్నో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన లక్నోకు వెళ్లి మాయావతితో భేటీ అయి చర్చించారు. ఈ మేరకు ఇరువురు పొత్తుపై అంగీకారానికి వచ్చారు. ఇరువురు నేతలు చాలాసేపు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికలు ఏడు ఫేజ్లలో జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ 11 న మొదటి ఫేజ్లోనే జరగనున్నాయి. ఈ ఎన్నికలకు 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో పవన్ లక్నోకు వెళ్లి మాయావతితో కలిసి, సంచలన నిర్ణయం ప్రకటించారు. నిన్నటి వరకు పవన్ తెలంగాణలో పోటీ చేయరేమోనని భావించారు. ఏపీ, తెలంగాల్లో బీఎస్పీకి కేడర్ ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనసేన పోటీ, పొత్తు ఎవరితో అంటే?
అత్యున్నత పదవి అధిరోహించాలి
దేశానికి దళిత మహిళ ప్రధాని కావడం తన ఆశయమని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీఎస్పీ అధికారంలోకి రావాలని, మాయావతి వంటి మహిళ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని జనసేనాని అభిప్రాయపడ్డారు. కాన్షీరామ్, అంబేడ్కర్, రాం మనోహర్ లోహియా సమానత్వం కోరుకున్నారని చెప్పారు. మాయావతితో కలిసి పని చేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. ఆమె ప్రధాని వంటి అత్యున్నత పదవిని అధిరోహించాలని చెప్పారు. ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఉన్నాయని, సీట్ల పంపకాలపై చర్చిస్తామన్నారు.
మీరు మాకు మార్గదర్శకం
తాము తెలంగాణలో కూడా కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని, కానీ ఆ హామీ నెరవేరలేదని, కానీ మాయావతిని ప్రధానిగా చేసి ఆ కలను నెరవేరుస్తామని చెప్పారు. మాయావతి ద్వారా తాను ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. అనుభవజ్ఞురాలిగా మీరు మాకు మార్గదర్శకం చూపించాలని కోరారు. కాగా, 2014లో కేసీఆర్ హామీ ఇస్తూ తెరాస గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
ఏపీ, తెలంగాణల్లో సీట్లు గెలుస్తాం
తమ పొత్తులు ముందుకు పోతాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఏపీ, తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కూడా తాము ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ను చూడాలని ఉందని ఆమె అన్నారు. త్వరలోనే తమ ఎన్నికల ప్రచారాన్ని ఏపీలో ప్రారంభిస్తామన్నారు. సీట్ల పంపకం పూర్తి కావొచ్చిందని మాయావతి తెలిపారు. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా యూపీకి వెళ్లారు.
ఇదీ పవన్ కళ్యాణ్, మాయావతి పొత్తు లెక్క
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జనసేన, బీఎస్పీ పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూడా వారు చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీలో లెఫ్ట్ పార్టీ, జనసేనలకు బీఎస్పీ మద్దతు పలికే అవకాశముందని అంటున్నారు. ఏపీలో బీఎస్పీ పోటీ చేయడం కంటే ఈ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, తెలంగాణలో బీఎస్పీకి ఎక్కువ సీట్లు ఇచ్చి.. జనసేన, బీఎస్పీలు కలిసి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పవన్ గతంలోను మాయావతితో భేటీ అయ్యారు.