స్త్రీలు వద్దంటే.. సరే, ఆ పత్రిక పద్ధతి మార్చుకోవాలి: నాయిని(పిక్చర్స్)
వరంగల్: మహిళలు వద్దంటే చీప్ లిక్కర్ బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం చెప్పారు. ప్రజలే తమకు హైకమాండ్ అని, వారి మాటను గౌరవిస్తామన్నారు. అందరూ వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం ఆలోచించి తీరాలని అభిప్రాయపడ్డారు.
ప్రజల యోగక్షేమాల దృష్ట్యా, ఆడబిడ్డల సౌభాగ్యం కోసం ప్రభుత్వం గుడుంబాను తెలంగాణ నుంచి తరిమేసేందుకు నిర్ణయం తీసుకున్నదన్నారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్ లిక్కర్ తేవాలని ఆలోచిస్తోందన్నారు. చీప్ లిక్కర్పై అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయన్నారు.
దీనిపైనా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రజలే మాకు హై కమాండ్ అన్నారు. ప్రజలు ఏది కావాలని చెబుతారో అదే చేస్తామన్నారు. చీప్ లిక్కర్పై పునరాలోచిస్తున్నామన్నారు. దీనిపై క్యాబినేట్లో చర్చిస్తామన్నారు. శనివారం హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాయిని
గ్రామాల్లో గుడుంబా మరణాలు పెరిగి చిన్న వయస్సులో మహిళలు వితంతువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని, ఈ పరిస్థితిని చూసి సమాజహితం కోసం సీఎం కేసీఆర్, ప్రభుత్వం గుడుంబాపై నిషేధం విధించాలని నిర్ణయించిందన్నారు.
నాయిని
వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే 265 గ్రామాలు గుడుంబాను నిషేధిస్తూ తీర్మానించుకున్నాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వాతావరణమే నెలకొన్నదని వివరించారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్ లిక్కర్ తేవాలనే ఆలోచన ఉన్నదన్నారు.
నాయిని
దీంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలనే ఆలోచనతోనే చీప్ లిక్కర్ ప్రతిపాదన తెరపైకి వచ్చిందన్నారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చీప్ లిక్కర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని, దీనిపై క్యాబినేట్లో చర్చిస్తామన్నారు.
నాయిని
ఈ నిర్ణయం సరైనదా కాదా అనే విషయంపై క్యాబినేట్లో పునరాలోచన చేస్తామన్నారు. ప్రజలకు ఇష్టంలేని పనులు అసలే చేయబోమని, ప్రజలే హై కమాండ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడో చెప్పారన్నారు. ప్రజల యోగక్షేమాల విషయంలో ప్రపంచంలో మరెక్కడా, ఎవరూ ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ ఒక సామాజిక తత్వవేత్తలా ఆలోచించి మెరుగైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.
నాయిని
అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, ముందుగా పోలీస్ స్టేషన్ల నుంచే ఆ దిశగా అడుగులు పడ్డాయని ఉదహరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్కు ఖర్చులను కూడా చరిత్రలో తొలిసారిగా చెల్లిస్తున్నామన్నారు.
నాయిని
పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతగా మిషన్కాకతీయలో చెరువులను దత్తత తీసుకున్నారన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు రూ.350 కోట్లు కేటాయించి ప్రతి ఠాణాకు వాహనాలు అందజేసిన ఘనత రాష్ర్టానికే దక్కిందన్నారు.
నాయిని
ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనని అంశాలను కూడా అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలకు కాళ్ల కింద నేల కదిలిపోయి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక పత్రిక కావాలని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నదని, ప్రతి అంశాన్ని వంకరబుద్ధితో చూస్తూ నిందలు వేస్తున్నదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, తీరు మార్చుకోవాలని హితవు పలికారు.