జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్, ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ ఆయన తన పోరాటం కొనసాగించనున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు.. పవన్ మద్దతు కోరారు.
ప్రజల్లోకి వెళ్తాం..
ఈ సందర్భంగా వీహెచ్తో కలిసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దని స్పష్టం చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. అఖిలపక్ష భేటీ రెండు మూడు రోజుల్లో ఉంటుందని చెప్పారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడాలి..
ఈ సందర్భంగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన్ను వీహెచ్ కోరారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్. జీవవైవిధ్యం నాశనమవడమే గాక, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలకు ముప్పు..
యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమవుతాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఆందోళన చెందిన చాలా మంది చెంచులు తమ దృష్టికి ఈ విషయం తెచ్చారని తెలిపారు.
పవన్తో కలిసి పోరాటం
యురేనియం తవ్వకాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు పెను సమస్యగా మారిందని వీ హనుమంతరావు అన్నారు. యురేనియం తవ్వకాలతో అడవుల్లోని వన్యప్రాణులు మృత్యువాత పడుతాయని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని వీహెచ్ చెప్పారు.