కలెక్టర్ను కొట్టా!.. టీడీపీ సాయం చేయలేదు: ఆర్ కృష్ణయ్య సంచలనం
హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీ వయసులో ఒక్కడినే పోరాటం చేశాను. అడ్డొచ్చిన కలెక్టర్ని కూడా కొట్టాను. ఆర్డీఓ కార్యాలయానికి తాళాలు వేశాను. బీసీల రాజ్యాధికారం కోసం మీరు కూడా నాలాగే చేయాలి' అని విద్యార్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
Recommended Video
గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోనని అన్నారు. ఏయా యాజమాన్యాలు ఫీజులు పెంచుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం మొత్తం ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని అన్నారు. రెండేళ్లపాటు విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్పై ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు.
చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తనకు ఎలాంటి సాయం చేయలేదని కృష్ణయ్య అన్నారు. టీడీపీ టికెట్ పై ఆర్ కృష్ణయ్య గత అసెంబ్లీ ఎన్నికలో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించగా, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకులు, పాల్గొన్నారు.
గౌరవాధ్యుక్షుడిగా తొలగింపు
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్యను పదవి నుంచి తొలగించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తిని నియమించాలని తీర్మానించింది.