మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళతాం, నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడే నామినేషన్లపై ఉత్తమ్ అభ్యంతరం
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడం సందేహాం తలెత్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి నామినేషన్ వేయడానికి మధ్య సమయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడబోదని చెప్పారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటుందని చెప్పారు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయం సాధించేందుకు అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. అందుకోసమే నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ వెంట వెంటనే సమయం కేటాయించారని పేర్కొన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. నోటిఫికేషన్, నామినేషన్ వేసే సమయం మధ్య గ్యాప్ ఉండాలని కోరతామని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంచార్జీల నియామకం వద్దే ఆగిపోయింది. అభ్యర్థుల ఎంపికపై రఫ్గా కొలిక్కి కూడా రాలేదు. దీనిపై సొంత పార్టీ నుంచి ఉత్తమ్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీల గురించి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియాకు సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిఫికేషన్, నామినేషన్ల గురించి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.