నిజామాబాద్ ‘మేయర్’:తేల్చేసిన ఎంపీ అరవింద్, కేసీఆర్కు సవాల్, భోధన్కు ఎంఐఎం పట్టు?
నిజామాబాద్: తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 కార్పొరేషన్లలో దాదాపు అన్నింటినీ టీఆర్ఎస్ ఖాయం చేసుకుంది. అయితే, ఒక్క నిజామాబాద్లో మాత్రం ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మేయర్ పదవికి కావాల్సినంత బలం రాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మేయర్ పదవిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించారు.
ప్రతిపక్షంలోనే ఉంటాం..
తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని అరవింద్ ఆదివారం ప్రకటించారు. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిరగ్ తమకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతోపాటు ఓటింగ్ పరంగా టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యుల బలం ఉండటంతో తాము వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు.
అత్యధిక స్థానాలు దక్కించుకున్న బీజేపీ..
నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని చాటుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి 13 స్థానాలు, ఎంఐఎంకు 16, కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాల్లో, ఓ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
మేయర్ దక్కించుకునే అవకాశం దాదాపు లేకపోవడంతో అరవింద్ ప్రతిపక్షంలోనే ఉంటామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి.. కండిషన్స్...
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, దాని మిత్రపక్షం ఎంఐఎం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు మేయర్ పదవిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నిజామాబాద్లో మద్దతిస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థి కూర్చుంటారా? లేక ఎంఐఎం అభ్యర్థి కూర్చుంటారా? అనేది ఉత్కంఠగా మారింది.
రాజీనామా చేస్తారా? అంటూ కేసీఆర్కు సవాల్..
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు అరవింద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఎత్తున డబ్బులు పంచారని అరవింద్ ఆరోపించారు. ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని.. త్వరలోనే టీఆర్ఎస్ భూస్థాపితం ఖాయమని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్రేనని ఎద్దేవా చేశారు.
కేసీఆర్.. దమ్ముంటే అడ్డుకోండి..
కాగా, టీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. టీఆర్ఎస్ సర్కారుపై ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అడ్డుకుని తీరాలని సవాల్ విసిరారు. సీఏఏపై తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదని, పార్లమెంటు చేసిన చట్టాన్ని అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు తాము వ్యతిరేకమని కేసీఆర్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామన్నారు. కలిసివచ్చే నేతలతో కలిసి సీఏఏపై పోరాటం చేస్తామన్నారు.