మందకృష్ణను అణచేస్తాం, కిషన్రెడ్డి సీఎం కావాలి:కెసిఆర్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తమ ప్రభుత్వం అధికారికంగా జరపబోదని కెసిఆర్ స్పష్టం చేశారు.జూన్ 2 తెలంగాణకు అసలైన విమోచన దినోత్సవమని కెసిఆర్ చెప్పారు.మందకృష్ణ మాదిగతో ఎబిసిడి వర్గీకరణ సాధ్యం కాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై మందకృష్ణ నిరసనలకు దిగాడని కెసిఆర్ విమర్శించాడు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల ద్వారా ఇచ్చే సహయాన్ని పెంచనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై తెలంగాణ సీఎం కెసిఆర్ బుధవారం నాడు చెప్పారు. విపక్షాలపై తెలంగాణ సీఎం కెసిఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తీరును అసెంబ్లీలో దుమ్మెత్తిపోశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులతో పాటు ఇప్పటివరకు చోటు చేసుకొన్న పరిస్థితులను కెసిఆర్ ప్రస్తావించారు.
జూన్2 తెలంగాణ విమోచన దినం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకొందామన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేసిన విషయం వాస్తవమేనని కెసిఆర్ చెప్పారు . కొందరి మనోభావాలను దెబ్బతిసేవిధంగా వ్యవహరించకూడదని తాము భావిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. బిజెపి నేతలు మాత్రం కొందరి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాయుధపోరాటం కూడ తెలంగాణ విమోచనంలో కూడ భాగమేనని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచనపై ప్రేమ ఉన్న బిజెపి నేతలు సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులకు పెన్షన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణతో వర్గీకరణ రాదు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో ఎబిసిడి వర్గీకరణ రాదని తెలంగాణ సీఎం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో తాను కూడ సభ్యుడిగా ఉండి వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకొన్న విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు. టిఆర్ఎస్ కూడ వర్గీకరణకు అనుకూలమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ అసెంబ్లీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మాణం చేసిందన్నారు. ప్రధానమంత్రికి ఈ తీర్మానం ఇచ్చి వర్గీకరణ గురించి వివరించామన్నారు. అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. అయితే ప్రపంచ తెలుగు మహసభలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మకైన మందకృష్ణ మాదిగ ఆందోళనకు దిగితే అరెస్ట్ చేశామన్నారు. ఇదే తరహలో భవిష్యత్తులో కూడ వ్యవహరిస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని కెసిఆర్ ప్రకటించారు.మందకృష్ణతో ఎబిసిడి వర్గీకరణ సాధ్యం కాదన్నారు. వర్గీకరణ కోసం కెసిఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పారు.భవిష్యత్ను పాడు చేసుకోకూడదని కెసిఆర్ మాదిగ యువతను కోరారు.
ప్రతి కుటుంబానికి హెల్త్ఫైల్
రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి చెందిన హెల్త్ ఫైల్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. ముందుగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అమెరికా తరహలో ప్రతి కుటుంబానికి చెందిన హెల్త్ ఫైల్ తయారు చేయనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల రికార్డులను తయారు చేయనున్నట్టు చెప్పారు. ఈ రికార్డు భవిష్యత్ లో వారికి వచ్చే జబ్జులకు చికిత్స చేసేందుకు పనికొస్తోందని కెసిఆర్ చెప్పారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సహయం పెంచుతాం
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్దిదారులకు ఇచ్చే సహయాన్ని త్వరలో పెంచనున్నట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తున్న సహయానికి మరికొంత సహయాన్ని అందించనున్నట్టు చెప్పారు. హస్టల్ విద్యార్ధులకుసన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని ఇస్తున్నారా అంటూ బిజెపి ఎమ్మెల్యేలను కెసిఆర్ ప్రశ్నించారు. రైతులకు భీమా సౌకర్యాన్ని కూడ అందిస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తైందన్నారు. కొత్త పాస్ పుస్తకాలను అందించనున్నట్టు చెప్పారు.
కిషన్ రెడ్డి సీఎం కావాలి
బిజేపీ నేత కిషన్ రెడ్డి కష్టపడే తత్వం ఉందని తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే.. ప్రభుత్వ విధానాలు, పరిపాలనపై అవగాహన పెంచుకుని మాట్లాడితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. . ఈ సందర్భంగా రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చెప్పిన లెక్కలపై కేసీఆర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.