తెలంగాణలో రాక్షస పాలన: గర్జించు..గాండ్రించు: గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా: బండి సంజయ్
నారాయణ్పేట్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నిక, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత, అనూహ్య ఫలితాలను సాధించిన కమలనాథులు ఇక జిల్లాలపై దృష్టి సారించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టదలిచిన మూడు వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన రైతు అవగాహన సదస్సులను రాజకీయంగా ఎదగడానికి వినియోగించుకుంటోందా పార్టీ.
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్
నారాయణ్పేట్ జిల్లాలో బండి సంజయ్..
ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. నారాయణ్పేట్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన నారాయణ్పేట్కు చేరుకున్నారు. సాయంత్రం ఆయన రైతు అవగాహన సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. నారాయణ్పేట్కు వెళ్లే మార్గంలోని మరికల్ మండలం అప్పంపల్లి వద్ద స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా..
స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్.. స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ అనూహ్యంగా విస్తరిస్తోందని, దాన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని, గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. టీఆర్ఎస్-ఎంఐఎం కాంబినేషన్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని విమర్శించారు.
నాడు దాగుడు మూతలు.. ఇప్పుడు దాడుల మోతలు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు.. వేర్వేరుగా పోటీ చేసినట్లు దాగుడు మూతలు ఆడిన ఆ రెండు పార్టీలు..ఎన్నికల తరువాత దాడుల మోతలకు పాల్పడుతున్నాయని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణ గల ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కూడా ఇలాంటి దాడులకు భయపడబోడని అన్నారు. హిందుధర్మ పరిరక్షణ ఒక్క బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అందుకే- ప్రతి కార్యకర్త కూడా పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి గర్జించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో రామరాజ్య స్థాపన కావాలి..
తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాల్సి ఉందని, లేకపోతే రాక్షసరాజ్యంగా మారుతుందని అన్నారు. మైనారిటీ సంతృప్తీకరణ, ఒక వర్గానికి కొమ్ముకాసే దిశగా రాజకీయ పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. స్వామి వివేకానందుడు.. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి యువకుడు కూడా కాషాయజెండాను భుజాన మోస్తూ, భారతమాతాకీ జై, జైశ్రీరామ్ అని నినదిస్తూ రామరాజ్య స్థాపన కోసం కృషి చేయాలని, అప్పటిదాకా అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.