టీడీపీలోనే: తేల్చి చెప్పిన నామా, సండ్ర, మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఇలా
ఖమ్మం: తాము తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు సండ్ర వెంకట వీరయ్య తేల్చి చెప్పారు. ఖమ్మంలో జిల్లా టీడీపీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. 14ఏళ్లుగా టీడీపీలో ఉన్నానని గుర్తు చేశారు. ఖమ్మం ఎంపీగా ఉన్న సమయంలో 2.64లక్షల సంతకాలు చేశానని, అందులో 1.20లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు, 60వేల మందికి రైల్వే పాస్లు ఇచ్చానని చెప్పారు.
ఎంపీగా తాను చేసిన పర్యటనలు ఎవరూ చేయలేదన్నారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఖండించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు.
పల్లెపల్లెకూ తెదేపా పేరుతో అన్ని మండలాల్లో పెద్దఎత్తున్న కార్యక్రమాలు చేస్తుంటే పార్టీ మారతారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సండ్ర మండిపడ్డారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో టీటీడీపీని విలీనం చేయాలని అనడం సరికాదని హితవు పలికారు.ఇటీవల పార్టీ మారతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో నేతలు పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.