కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే ఆ పని చేయాలి... : ప్రాజెక్టులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఏపీ ఎత్తులకు పైఎత్తులు వేసి దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లే సుప్రీం కోర్టుకు వెళ్లామన్నారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ పిటిషన్లో ఇంప్లీడ్ కావాలని,అంతే తప్ప దీన్ని కూడా రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. నాడు పీజేఆర్ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించినా కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు కరువైందన్నారు. తమకు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అనే తేడా లేదని, తమకు తెలంగాణ అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.
కాగా,పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ మౌనక వెనుక పెద్ద కుట్ర ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాలపై కేం ద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు హాజరవకుండా కేబినెట్ భేటీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.సుప్రీంకోర్టులో వేసిన రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ఏపీ ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేయాలనే అంశం లేదని విమర్శించారు.
కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్ బాధ్యత వహించాలని, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైతే కేసీఆర్ విఫలమైనట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు బీజేపీ నేతలు కూడా పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తున్నారు.మెగా కృష్ణారెడ్డికి పోతిరెడ్డిపాడు టెండర్లు వచ్చేలా చేయడానికే అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయమని కేసీఆర్ కేంద్రాన్ని కోరారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ఏపీ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలనే ఉద్దేశం కేసీఆర్కు లేదని వారు ఆరోపిస్తున్నారు.