ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ కలుస్తాయి, ఆ పరిస్థితి రాదు, సీఎం రేసులో లేను: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: డిసెంబర్లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసిపోతాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆ రెండు పార్టీలు కలవడానికి వంద శాతం అవకాశముందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ 50 శాతం సీట్లు గెలిచే అవకాశం కూడా లేదని, బీజేపీకి తెలంగాణలో ఆరు ఏడు స్థానాలు వస్తాయని భావిస్తున్నారని చెప్పారు. మజ్లిస్ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ని ఓడించాలని హరీష్రావు ఫోన్, ఫండ్ ఇస్తానంటే అందుకే వద్దన్నా: బాంబుపేల్చిన వంటేరు
తెరాసకు సీట్లు తక్కువ పడితే కేసీఆర్ వెంటనే బీజేపీ, మజ్లిస్ పార్టీలతో చర్చలు జరుపుతారని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు మజ్లిస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు. కానీ అలాంటి దారుణ పరిస్థితికి అవకాశమే లేదని, ఎందుకంటే కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, ఆయన ఆందోళనలో ఉన్నారని జైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అద్భుత విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులోనే లేనని, అలాంటప్పుడు రేసులో ముందు వరుసలో ఎలా ఉంటానని అన్నారు. వయసు వంటి పలు కారణాల వల్ల తాను పోటీ చేయడం లేదన్నారు.