పార్కుల్లో కనిపించే ప్రేమికులకు కొత్త పాఠాలు నేర్పిస్తున్న భజరంగ్దళ్
హైదరాబాదు: వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాదులోని పార్కులు లేదా ఇతర ప్రదేశాల్లో కనిపించిన ప్రేమజంటలకు దేశభక్తి పాఠాలు బోధిస్తామని బజరంగ్ దల్ రాష్ట్ర శాఖ తెలిపింది. దేశం కోసం ప్రాణత్యాగాల వంటి వాటిపై ప్రేమజంటలకు పాఠాలు చెబుతామని చెప్పింది. గతేడాది ఇదే రోజున పుల్వామాలో 45 మంది జవాన్లు పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులయ్యారని గుర్తుచేసింది. ఆ త్యాగమూర్తులను ఎలా మరువగలమని తెలుగురాష్ట్రాల వీహెచ్పీ పబ్లిసిటీ కన్వీనర్ బాలస్వామి అన్నారు. వారు దేశం కోసం అమరులైన రోజున ప్రేమికుల రోజును జరుపుకోవడం భావ్యం కాదన్నారు.
Recommended Video
ప్రేమికులు పార్కుల్లో, షాపింగ్ మాల్స్లో, క్లబ్స్లో, పబ్బుల్లో కనిపిస్తే వారికి వివాహం చేయబోమని బాలస్వామి చెప్పారు. దీనికి బదులు దేశభక్తిపై కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. వీర జవాన్ల త్యాగం స్ఫూర్తినివ్వడమే కాకుండా దేశభక్తిని కూడా పెంచుతుందని చెప్పారు. ఇక శుక్రవారం రోజున దాదాపు 500 మంది వాలంటీర్లు ఉంటారని చెప్పారు. ఇప్పటికే 1000 మంది వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 14న ఉంటారని చెప్పారు.
ఫిబ్రవరి 12వ తేదీన వీహెచ్పీ మరియు భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాదులోలోని కోటిలో భారీ స్థాయిలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులను తగలబెట్టారు. ఆ తర్వాత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన భజరంగ్ దళ్ నేతలు రాష్ట్రంలో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు హోటల్స్లో పబ్స్లో రెస్టారెంట్లలో వాలెంటైన్స్ డే వేడుకలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్ డేగా కాకుండా వీర్ జవాన్ దివాస్గా గుర్తిస్తున్నట్లు భజరంగ్దల్ కార్యకర్తలు చెప్పారు.