చల్లని కబురే కానీ.. : తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారంనాడు మహారాష్ట్రలోని విదర్భా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆివారం నాటి ఉత్తర-దక్షిణ ద్రోణి విచ్ఛిన్నతి సోమవారం విదర్భా దాని పరిసర ప్రాంతాల నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కేరళ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఏర్పడింది.
Recommended Video
రాగల మూడు రోజులు(మే 10, 11, 12 తేదీలు) తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతోపాటు ఒకటి రెండు చోట్ల వడగండ్లు కూడా పడతాయని అంచనా వేసింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలో వడగండ్ల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
కాగా, గత వారం పదిరోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అక్కడక్కడా వడగండ్ల వానలు కూడా కురిశాయి. దీంతో అన్నదాతలు పంట నష్టపోయారు. మామిడి రైతులు, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మరో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయని చెప్పడంతో చేతికొచ్చిన పంట ఎక్కడ చేజారితోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.