తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు
హైదరాబాదు: అసలే కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే తాజాగా వాతావరణం కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలం ప్రారంభమై అధిక ఉష్ణోగ్రతలతో ఆ మహమ్మారి బతకదని కొన్ని నివేదికలు వస్తున్నప్పటికీ వాతావరణం మాత్రం అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షానికి తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక ఏప్రిల్ 6వ తేదీన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షం కురిసింది. మరట్వాడా ప్రాంతం ఉపరితలంలో తుఫాను ఏర్పడిందని ఇది సముద్రమట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అక్కడి నుంచి తెలంగాణ వైపుగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కేరళ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు తుఫాను ప్రభావం కొనసాగుతోందని చెప్పారు. దీంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక కోస్తాంధ్రతో పాటు యానాం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 11 ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, కర్నూలులో మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులువెల్లడించారు. విదర్భ నుంచి కేరళ వరకు తుఫాను ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో కర్నాటక కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అంతేకాదు రానున్న 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కేరళలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
ఈ సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో వైద్యులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాతావరణం చల్లగా ఉంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు రాకపోవడమే ఉత్తమమైన పని అని చెబుతున్నారు. సామాజిక దూరంను కూడా పాటించడం చాలా ప్రాముఖ్యమైన అంశమని వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రతను మెయిన్టెయిన్ చేయాలని సూచించారు.