గుడ్ న్యూస్ : తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఎప్పుడంటే...
హైదరాబాదు: ఓ వైపు కరోనా మంట మరో వైపు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుంది. తెలంగాణ రైతాంగానికి కూడా ఇది మంచి శుభవార్తే అవుతుంది. తెలంగాణలో జూన్ రెండో వారంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కేరళను జూన్ 5 నాటికి తాకుతాయని నిపుణులు చెప్పారు. ఇక కేరళను నైరుతీ రుతుపవనాలు తాకడంలో కాస్త జాప్యం జరుగుతుందని వారు చెప్పారు. ఇదిలా ఉంటే మరో ప్రైవేట్ సంస్థ మాత్రం మే 28న రుతుపవనాలు కేరళ తీరంను తాకుతాయని వెల్లడించింది.
సాధారణంగా కేరళలో ఏటా జూన్ 1 నుంచే వర్షాలు కురవడం ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మరో నాలుగురోజులు ఆలస్యం కానున్నాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పలు ప్రైవేట్ వాతావరణ కేంద్రాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే జూన్ 10వ తేదీనాటికి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు భారత వాతారణ శాఖ ఐఎండీ మాత్రం తెలంగాణలో జూన్ 8 నుంచి 12వ తేదీల మధ్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తోంది. ఏపీలో జూన్ 8 నుంచి 11 మధ్య ప్రవేశిస్తాయని తెలిపింది.
ప్రస్తుతం బంగాళా ఖాతంలో తేమతో కూడిన గాలులు వీస్తున్నందున తెలంగాణ ఏపీల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయని అయితే త్వరగానే వాతావరణ పొడిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో ఆ ప్రభావం తెలంగాణ పై పడుతోందని అందుకే మే 16న వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఈ అల్ప పీడన ద్రోణి మరింత బలపడి తుఫానుగా మారుతుందని ఆ తర్వాత తేమతో కూడిన గాలి వాతావరణంను మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న 24 గంటల్లో ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ గాలులు బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తాయని వివరించారు.
ఇదిలా ఉంటే హైదరాబాదులో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్న సమయంలో ఆకాశాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. అనంతరం గాలులతో కూడిన వర్షాలు పడటంతో గత రెండు రోజులుగా ఉన్న ఎండ వేడిమి నుంచి నగరవాసులు ఊరట చెందారు.