cool news: తెలంగాణ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎండవేడిమితో తల్లడిల్లిపోతున్న తెలంగాణ ప్రజలకు ఇది ఒక చల్లని వార్తే. ఎందుకంటే, వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాలతో సాధారణ వర్షపాతమే కానీ, ఆ 2 నెలల్లో భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోనూ..
నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
రోహిణి కార్తె ప్రవేశించడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. జనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళాలంటే బయపడిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, వడగాలులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణ ప్రజలకు వర్షాలు పడతాయంటూ ఉపశమనం కలిగించే వార్త చెప్పారు.
మంగళవారం కూడా తెలంగాణలోని జిల్లాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వీచాయి. వాతావరణం కూడా కొంచెం చల్లబడింది.
కాగా, మంచిర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, జగిత్యాల 45.0, నిజామాబాద్లో 44.7, పెద్దపల్లిలో 44.1, కామారెడ్డిలో 44.1, సంగారెడ్డిలో 43.1, కరీంనగర్ 43.5, కుమరంభీం 43.3, సూర్యపేట 42, ఖమ్మం 42.3, భూపాలపల్లి 42.1, వరంగల్ అర్బన్ 42.1, నల్గొండ 42.1, వరంగల్ రూరల్ 42.6, సిద్దిపేట 42.6, రంగారెడ్డి 42.3, వనపర్తి 40, జోగులాంబ గద్వాల 39.9, ఆదిలాబాద్ 45.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.