సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?
Recommended Video
హైదరాబాద్ : సారు.. కారు.. పదహారు అంటూ లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతల హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణలోని 17 సెగ్మెంట్లలో 16 స్థానాలు గెలిచి కేంద్రంలో కీ రోల్ పోషిస్తామని ప్రచారం హోరెత్తించారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ అంచనాలకు దగ్గరగా వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అదలావుంటే బీజేపీకి 150 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు అటుఇటుగా వస్తాయని జోస్యం చెప్పిన టీఆర్ఎస్ పెద్దలు.. థర్డ్ ఫ్రంట్తో ఢిల్లీలో చక్రం తిప్పుతామని ఢంకా బజాయించారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే సీన్ రివర్స్గా కనిపిస్తోంది. ఎన్డీయే కూటమికి 300 పైచిలుకు మెజార్టీ స్థానాలు దక్కుతాయని ఆయా సంస్థలు వెల్లడించడం చర్చానీయాంశమైంది.
16 స్థానాల్లో గెలిచినా.. ఢిల్లీలో నో యూజ్
టీఆర్ఎస్ అనుకున్నట్లుగానే సారు.. కారు.. పదహారు క్యాప్షన్ వర్కవుట్ అయ్యేటట్లు కనిపిస్తున్నా.. థర్డ్ ఫ్రంట్ పేరిట సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టేటట్లు కనిపిస్తోంది వ్యవహారం. కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగా తెలంగాణలో 16 లోక్సభ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పాగా వేయబోతోందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సారాంశం. అంతవరకు బాగానే ఉన్నా.. థర్డ్ ఫ్రంట్తో కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆలోచనలు మాత్రం నీరుగారిపోయేటట్లు ఉంది పరిస్థితి.
ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినంత మెజార్టీ రాదని టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో హోరెత్తించారు. ప్రత్యామ్నాయంగా ఇతర పక్షాలు అధికారంలోకి వచ్చే ఛాన్సుందని చెప్పుకొచ్చారు. అలా తెలంగాణలో 16 స్థానాలు గెలిస్తే ఢిల్లీలో కీ రోల్ ప్లే చేయొచ్చనేది గులాబీ నేతల అంచనా. ఆ మేరకు థర్ఢ్ ఫ్రంట్ పేరిట కొన్ని పార్టీల అధినేతలతో మంతనాలు కూడా జరిపారు కేసీఆర్.
కేంద్రంలో చక్రం తిప్పుదామనుకుంటే..!
16 స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చనేది కేసీఆర్ అంతరంగం. కానీ, ఆ పదహారు స్థానాలు టీఆర్ఎస్కే దక్కే ఛాన్సున్నా.. కేంద్రంలో మాత్రం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ హవా ఏ మాత్రం కనిపించే ఆస్కారం లేకుండా పోయింది. ఎన్డీయే, యూపీఏ కూటములకు మెజార్టీ రాని పక్షంలో ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి ఢిల్లీలో మేజర్ రోల్ పోషిద్దామని కేసీఆర్ భావించారు. అదే సమయంలో అటు బీజేపీకి టచ్లో ఉంటూ వచ్చారు.
అనుకున్నదొక్కటి.. అయ్యేదొక్కటి..!
ఎన్డీయేకు బంపర్ మెజార్టీ స్థానాలంటూ మాగ్జిమమ్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఆ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి చిన్న చితకా పార్టీలతో గానీ, ప్రాంతీయ పార్టీలతో గానీ అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఢిల్లీలో కీ రోల్ పోషించాలనే కేసీఆర్ ఆలోచనలకు బ్రేక్ పడినట్లైంది. టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలిస్తే.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఏ పార్టీకైనా సపోర్ట్ అవసరమైతే మద్దతిచ్చి తమకు కావాల్సిన ప్రయోజనాలు ఆశించే స్థాయిలో కూడా టీఆర్ఎస్ ధోరణి కనబడింది. కానీ, అలాంటి అవకాశమేది టీఆర్ఎస్కు దక్కని పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్లో ఎన్టీయేకు బంపర్ మెజార్టీ రావడంతో గులాబీ వనం నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
తెలంగాణలో జోరు.. ఢిల్లీలో బేజారు..!
తెలంగాణలో కొనసాగుతున్న కారు జోరు కేంద్రంలో చతికిలపడేటట్లు కనిపిస్తోంది తాజా వ్యవహారం. టీఆర్ఎస్ పెద్దలు ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్న పరిస్థితి. థర్డ్ ఫ్రంట్ పేరుతో కలిసొచ్చే భాగస్వామ పక్షాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టినట్లైంది. థర్డ్ ఫ్రంట్కు మద్దతివ్వాలంటూ టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి కేసీఆర్ మద్దతు కోరారు. అయితే తదనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆమె భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఒడిషాకు వెళ్లి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ను కేసీఆర్ కలిసొచ్చిన తర్వాత.. వారి పార్టీ ఎంపీ చంద్రబాబుతో భేటీ కావడం చర్చానీయాంశమైంది.
ఇప్పటిదాకా ప్రత్యక్ష మద్దతు ఏది..?
తాజాగా తమిళనాడు వెళ్లిన కేసీఆర్.. డీఎంకే చీఫ్ స్టాలిన్తో భేటీ అయ్యారు. థర్డ్ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఆయనను కలిసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ మరునాడే స్టాలిన్ బాంబ్ పేల్చారు. డీఎంకే యూపీఏలో భాగస్వామ్యపక్షమని.. అసలు తమ మధ్య ఫ్రంట్ గురించిన చర్చలే జరగలేదన్నారు. అదలావుంటే ఇటీవల తిరుపతికి వచ్చిన మాజీ ప్రధాని దేవేగౌడ కూడా యూపీఏకే తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కలిసినా ఏ ఒక్కరూ కూడా థర్డ్ ఫ్రంట్కు ప్రత్యక్ష మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు.
కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పి పెద్దాయన ఢిల్లీలో కీ రోలో పోషించనున్నారనే టాక్ నడిచింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే సీన్ రివర్సయినట్లు కనిపిస్తోంది. అదలావుంటే, థర్డ్ ఫ్రంట్ కథ కంచికేనా అనే వాదనలు జోరందుకున్నాయి.